ఆఫీసర్లు వస్తున్నరని అలర్ట్ అయిన్రు .. అధికారులకు చిక్కకుండా మంచి కల్లు అమ్మకం

ఆఫీసర్లు వస్తున్నరని అలర్ట్ అయిన్రు .. అధికారులకు చిక్కకుండా మంచి కల్లు అమ్మకం
  • శాంపిల్స్​ సేకరించిన ఎక్సైజ్​ అధికారులు
  • మహబూబ్​నగర్​ ‘డి’ అడిక్షన్​ సెంటర్​కు పెరుగుతున్న బాధితులు

కల్తీ కల్లు తాగి హైదరాబాద్​లో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్​ అయిన క్రమంలో ఆ ప్రకంపనలు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లానూ తాకుతున్నాయి. ఇక్కడి యంత్రాంగం తనిఖీలకు సిద్ధం కాగా.. దుకాణ యజమానులు ముందే అలర్ట్​ అయ్యారు. మొన్నటి వరకు కొన్ని షాపుల్లో మందు కలిపిన కల్లు అమ్మారనే ఆరోపణలుండగా.. ఇప్పుడు మాత్రం మంచి కల్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఆఫీసర్లకు చిక్కకుండా యజమానులు జాగ్రత్తలు పడుతున్నారు. మరోవైపు ఎక్సైజ్​ అధికారులు ప్రతీ షాపును తనిఖీ చేసి శాంపిల్స్​ సేకరించి హైదరాబాద్​కు పంపుతున్నారు.

మహబూబ్​నగర్​, వెలుగు: కల్తీ కల్లు కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కూకట్​పల్లి ఘటనను సీరియర్​గా తీసుకున్న సర్కార్​ రాష్ట్రవ్యాప్తంగా కల్లు దుకాణాలపై తనిఖీలకు ఆదేశించింది. మూడు రోజుల క్రితమే ఎక్సైజ్​ అధికారులకు ఆదేశాలు రాగా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. కల్లు కాంపౌండ్​లను ఎక్సైజ్​ సీఐలు, ఎస్​ఐలు సిబ్బందితో కలిసి పరిశీలిస్తున్నారు. శాంపిల్స్​ తీసుకుని హైదరాబాద్​లోని ల్యాబ్స్​కు పంపుతున్నారు. 

మహబూబ్​నగర్​ జిల్లాలో రెండు ఎక్సైజ్​ సర్కిళ్ల పరిధిలోని జడ్చర్ల, బాదేపల్లి, మూసాపేట, నసురుల్లాబాద్​, గొండ్యాల్​, టంకర, బోయపల్లి, ఏనుగొండ, సీసీకుంట, కోయిల్​కొండ, హన్వాడ.. నారాయణపేట జిల్లాలో మక్తల్ మండలం సంగంబండ, కాచ్వార్, కాట్రేవుపల్లి, నారాయణపేట మండలం పెరపళ్ల, నారాయణపేట టౌన్, ఏక్లాస్​పూర్, జలాల్​పూర్, ఊట్కూర్ మండలం కొల్లూర్, తిప్రస్​పల్లి, పులిమామిడి, పెద్దజట్రం, నర్వ మండలం ఉందేకోడ్, మరికల్ మండలం జిన్నారం, మాగనూర్ మండలం ఓబుళాపురం, కృష్ణా మండలంలోని హిందూపూర్ గ్రామాల్లో కల్లు కాంపౌండ్​లను ఇప్పటికే తనిఖీలు చేసి 
శాంపిల్స్​ సేకరించారు.

తనిఖీలకు వస్తున్నారని తెలిసి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలను ఆఫీసర్లు తనిఖీలు చేసి శాంపిల్స్​ సేకరిస్తుండటంతో వ్యాపారులు అలర్ట్​ అయ్యారు. నాలుగైదు రోజుల క్రితం వరకు జిల్లాల్లో మందు కల్లు విక్రయాలు జోరుగా సాగాయనే ఆరోపణలు ఉండగా.. ఇప్పుడు మామూలు కల్లు అమ్ముతున్నట్లు సమాచారం. కల్తీ కల్లు అమ్ముతున్నట్లు శాంపిల్స్​ టెస్టింగ్​లో బయట పడితే ప్రభుత్వం నుంచి చట్టపరమైన చర్యలు ఉంటాయనే భయంతో వ్యాపారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు డ్రమ్ముల కొద్దీ కల్లును తయారు చేయగా.. ఇప్పుడు పావు వంతు మాత్రమే తయారు చేస్తున్నట్లు సమాచారం. హానికర రసాయనాలు కలువకుండా చూసుకుంటున్నారు.

‘డి’ అడిక్షన్​ సెంటర్​కు పెరుగుతున్న బాధితులు

మహబూబ్​నగర్​ ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లోని ‘డి’ అడిక్షన్​ సెంటర్​కు రోజురోజుకు మత్తు పదార్థాలకు అలవాటుపడిన బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో లిక్కర్​, గంజాయి, మందు కల్లుకు అలవాటుపడిన బాధితులు ఉంటున్నారు. రోజుకు ఎనిమిది నుంచి పది మంది వరకు ట్రీట్మెంట్​ కోసం వస్తున్నారు. అయితే ట్రీట్మెంట్​ తీసుకుంటున్న వారిలో ఎక్కువగా మందు కల్లుకు అలవాటుపడిన వారే ఉంటున్నట్లు తెలిసింది. సోమవారాల్లో ఈ సెంటర్​కు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. గత సోమవారం నుంచి శుక్రవారం వరకు దాదాపు వంద మందికి ట్రీట్మెంట్ అందించారు. ఇందులో ఒక్క సోమవారమే 35 మందికి ట్రీట్మెంట్​ ఇవ్వగా.. మంగళవారం 17 మందికి, బుధవారం 12 మందికి, గురువారం 15 మందికి, శుక్రవారం 16 మందికి చికిత్స అందించినట్లు అక్కడి రికార్టుల్లో
 నమోదైంది.

తనిఖీలు ముమ్మరం చేశాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా ఎక్సైజ్​ స్టేషన్​ల పరిధిలోని కల్లు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాల పరిధిలో 28 శాంపిల్స్​ను సేకరించాం. వాటిని టెస్టుల కోసం పంపించాం. కల్తీ కల్లు నియంత్రణకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

సుధాకర్​గౌడ్, ఎక్సైజ్​ సూపరింటెండెంట్, మహబూబ్​నగర్