కారు దిగుడే బెటర్..! లీడర్లు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం

కారు దిగుడే బెటర్..!  లీడర్లు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం
  • భైంసా ఏఎంసీ చైర్మన్ ​రాజేశ్ ​బాబుపై అనుచరుల ఒత్తిడి
  • త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని వెల్లడి

భైంసా, వెలుగు: స్వరాష్ట్ర సాధన కోసం మీరు సీఎం కేసీఆర్​తో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయినా మీకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వడం లేదు.. ఇక కారు దిగడమే బెటర్’ అని భైంసా ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబుపై అనుచరగణం ఒత్తిడి తీసుకువస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​తో హైదరాబాద్​లో జరిగిన ఘటనలో తనపై తప్పుడు ప్రచారం చేశారని నియోజకవర్గ పార్టీ నేతల తీరుపై రాజేశ్​బాబు సైతం తీవ్ర అసంతృత్తితో ఉన్నారు. 

కొంత కాలంగా స్థానిక ఎమ్మెల్యే విఠల్​రెడ్డితో ఆయనకు విభేదాలు కొనసాగుతుండడంతో ఆయన వర్గమే ఇదంతా చేసిందని రాజేశ్​ భావిస్తున్నారు. జిల్లాలోనే గిరిజన, లంబాడా సంఘాలే కాకుండా అన్ని వర్గాల వారు వారం, పదిరోజుల పాటు ఆందోళనలు చేస్తే.. ఎమ్మెల్యే విఠల్ ​రెడ్డి కనీసం స్పందించలేదు. దీంతో రాజేశ్ బాబుతో పాటు ఆయన అనుచరగణం ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ సమావేశంలో విఠల్ ​రెడ్డి, ఆయన అనుచరులపై ఇండైరెక్ట్​గా రాజేశ్​ బాబు మండిపడ్డారు. ఎవరినీ వదలనని, అంతు చూస్తానని హెచ్చరించారు.

పార్టీ మారితే మంచిదని..

శుక్రవారం లోకేశ్వరం మండలం రాజేశ్ తండాలో తన అనుచరగణంతో ఆయన ప్రత్యేకంగా​సమావేశమయ్యారు. ముథోల్, బాసర, లోకేశ్వరం మండలాలకు చెందిన బీఆర్​ఎస్​అసమ్మతి నేతలతో పాటు పలు పార్టీల కార్యకర్తలతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బాసర మాజీ ఎంపీపీ భర్త సాయినాథ్, ముథోల్​మాజీ జడ్పీటీసీ భర్త నర్సాగౌడ్​నేతృత్వంలోని పలువురితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే విఠల్​రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ మారాలని శ్రేణులు ఆయనకు సూచించారు. పార్టీ మారితేనే సత్పలితాలు వస్తాయని ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్​అధిష్ఠానం నుంచి ఆహ్వానాలు అందుతున్నట్లు సమాచారం. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ​హైదరాబాద్​కు రాగానే ఆయనతో రాజేశ్ బాబు భేటీ అయ్యి ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ముథోల్ ​బీఆర్​ఎస్​లో అసమ్మతి

ముథోల్​ బీఆర్ఎస్​లో కొంతకాలంగా అసమ్మతి నెలకొంది. ఇప్పటికే ముథోల్​ మాజీ జడ్పీటీసీ భర్త నర్సాగౌడ్​ బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి ఏ పార్టీలో చేరాలోనని ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే విఠల్​ రెడ్డికి మళ్లీ టికెట్ కేటాయించొద్దని సీనియర్ ​లీడర్లు సోలంకి భీంరావు, జీవీ రమణరావు, పండిత్​పటేల్ తదితరులు కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్​కు కంప్లైంట్ చేశారు. అయినా మళ్లీ ఆయనకే టికెట్​ ఇవ్వడంతో వారంతా​తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో అసంతృప్తి నేత ఏఎంసీ చైర్మన్​రాజేశ్ బాబు కూడా పార్టీ వీడితే ముథోల్​లో కారుకు నష్టాలు తప్పవు.