
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ స్కూళ్లుండగా, వాటిలో 34.83 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై ఎలాంటి నియంత్రణ లేదు. ఏ స్కూల్లో ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేకపోవడంతో మేనేజ్మెంట్లు వారికి నచ్చినంత ఫీజును నిర్ణయిస్తున్నాయి. వసూలు చేసిన ఫీజులను ఎలా ఖర్చు చేయాలో చెప్తూ జీవో నంబర్–1ను ప్రభుత్వం గతంలో జారీ చేసింది.
గత బీఆర్ఎస్ సర్కారు ఫీజుల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టని ప్రభుత్వం, అమలును కూడా గాలికి వదిలేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఇందుకోసం మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో కేబినెట్సబ్కమిటీ వేసింది. దీంతో పాటు తెలంగాణ విద్యా కమిషన్ను ఏర్పాటు చేసింది.
విద్యా కమిషన్సర్కారుకు నివేదిక ఇవ్వడంతో.. త్వరలోనే ప్రభుత్వం ఫీజుల రెగ్యులేషన్ చట్టం తెస్తుందనే వార్తలు వచ్చాయి. దీంతో పలు స్కూళ్లు 2025–26 సంవత్సరానికి ముందస్తుగా 20 నుంచి 50 శాతం దాకా ఫీజులు పెంచేశాయి. ప్రస్తుతం స్కూళ్లను బట్టి సరాసరి ఏటా రూ.30 వేల నుంచి రూ.12 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువులకూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు లెక్కలేదు. ఇక కార్పొరేట్ కాలేజీలు ఐఐటీ, నీట్కోచింగ్పేరుచెప్పి రెండేండ్ల ఇంటర్మీడియెట్ కు రూ.4 నుంచి రూ.10 లక్షల దాకా గుంజుతున్నాయి.