కొత్త కార్డులొచ్చేశాయి ..ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12,047 రేషన్ కార్డులు 

కొత్త కార్డులొచ్చేశాయి ..ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12,047 రేషన్ కార్డులు 
  • పెరిగిన మెంబర్లు 1,06,432 మంది
  • కొత్తవారికీ రేషన్ అలాట్​మెంట్

యాదాద్రి, నల్గొండ, వెలుగు : రేషన్ కార్డుల విషయంలో సర్కారు వేగంగా చర్యలు తీసుకుంటోంది. రెండు నెలలుగా కొత్త కార్డులు జారీ చేయడంతోపాటు మెంబర్లనూ యాడ్ చేస్తోంది. కార్డుల మంజూరుతోపాటు యాడ్ చేసిన మెంబర్లకు సన్నబియ్యం అందిస్తోంది. 

కొత్త కార్డులకు లక్షకుపైగా అప్లికేషన్లు..

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లను స్వీకరించింది. ప్రతి స్కీమ్​కు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో యాదాద్రి జిల్లాలో అప్లికేషన్లు వెల్లువెత్తాయి. ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో 96,792 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 45 వేల అప్లికేషన్లను వెరిఫై చేయగా, కొన్ని వివిధ స్థాయిల్లో పెండింగ్​లో ఉన్నాయి. రెగ్యులర్​గా మీ సేవ నుంచి ఎప్పటికప్పుడు కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి. వచ్చిన అప్లికేషన్లు వచ్చినట్టే స్క్రూట్నీ చేస్తున్నారు. 

యాదాద్రిలో కొత్తగా 2,059 కార్డులు..

మీ సేవలో వచ్చిన 3,500 అప్లికేషన్లలో 200కు పైగా రిజెక్ట్ చేశారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లను రెండు నెలలుగా స్క్రూట్నీ చేస్తున్నారు. మీ సేవలో వచ్చిన అప్లికేషన్లలో 2,059 మందికి కార్డులు మంజూరు చేశారు. కొన్ని వివిధ దశల్లో పెండింగ్​లో ఉన్నాయి. మెంబర్ షిప్ కోసం కొత్తగా వచ్చిన అప్లికేషన్లలో 2,500 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. 33 వేల మందిని యాడ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ కోటా ప్రకారం యాదాద్రి జిల్లాలో 2,16,904 కార్డులు ఉండగా, కుటుంబ సభ్యులు 6,76,188 మంది ఉన్నారు. వీరికి 4,307 టన్నుల బియ్యం అందుతున్నాయి. అయితే అదే నెలలో ఓకే చేసిన 419 రేషన్ కార్డు లబ్ధిదారులకు, యాడ్ చేసిన 30,180 మందికి మేలోనే రేషన్ అందించారు. ఇప్పుడు మేలో 1654 కార్డులు, 3,253 మందిని యాడ్ చేశారు. వీరందరూ జూన్​లో మూడు నెలల రేషన్ ​ఒకేసారి అందుకోనున్నారు. 

నల్గొండ జిల్లాలో..

నల్గొండ జిల్లాలో 4,66,061 రేషన్ కార్డులు ఉండగా, 13,85,506 యూనిట్లు ఉన్నాయి.  ప్రజాపాలనలో 96 వేల అప్లికేషన్లు, బీసీ కుల గణన సందర్భంలో 30 వేల అప్లికేషన్లు, మీ సేవ కేంద్రాల్లో 19 వేల మంది అప్లై చేసుకున్నారు. వీటిలో స్క్రూట్నీ చేసిన తర్వాత జిల్లాలో కొత్తగా 8,750 కార్డులు మంజూరు చేశారు. దీంతో కొత్తగా 61,247 మంది లబ్ధిదారులు పెరిగారు.  గతంలో 8,877 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తుండగా, కొత్తగా 61,247 మందిని యాడ్ చేయడంతో 3,674 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేయనున్నారు.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో మొత్తం 3,26,057 రేషన్ కార్డులు ఉండగా, 9,85,061 యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో మీ సేవ కేంద్రాల్లో 2,094 మంది రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోగా, 15,106 మంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు. వీటిలో  కొత్తగా 1,238 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా, 11,752  మంది కుటుంబ సభ్యుల పేర్లను కార్డులో చేర్చారు.  గతంలో 6,500 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తుండగా, 11,752 మంది కొత్తగా చేరడంతో 300 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా సరఫరా చేయనున్నారు.   

అర్హులందరికీ రేషన్ కార్డులు  

రేషన్ కార్డులు, మెంబర్లను యాడ్ చేయడం కోసం వచ్చిన అప్లికేషన్ల వెరిఫికేషన్ రెగ్యులర్​గా నడుస్తోంది. ప్రతినెలా కొత్త కార్డులు, మెంబర్ల సంఖ్య పెరుగుతోంది. అప్లికేషన్లలో కొన్ని వివిధ స్థాయిలో పెండింగ్​లో ఉన్నాయి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. మెంబర్లుగా యాడ్ చేస్తాం.- వీరారెడ్డి, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి