ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. 'టీ-9 టికెట్‌' సమయాల్లో మార్పు

ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. 'టీ-9 టికెట్‌' సమయాల్లో మార్పు

గ్రామీణ, ప‌ట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టీ-9 టికెట్‌' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

టీ-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబి టికెట్‌ వర్తిస్తుంది. టీ-9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.