
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షట్లర్, తెలంగాణ కుర్రాడు మన్నేపల్లి తరుణ్ ఆర్కిటిక్ ఓపెన్లో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో తరుణ్ 11–21, 21–11, 22–20తో వరల్డ్ 14వ ర్యాంకర్, ఏడోసీడ్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)కు షాకిచ్చి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు.
గంటా 8 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్ తొలి గేమ్ను చేజార్చుకున్నాడు. కానీ రెండో గేమ్లో వ్యూహాత్మకంగా ఆడి ప్రత్యర్థికి చెక్ పెట్టాడు. 3–0తో గేమ్ మొదలుపెట్టి పొపోవ్కు స్కోరును సమం చేసే చాన్స్ ఇవ్వలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్లో స్కోరు 7–7తో సమమైన తర్వాత తరుణ్ అనూహ్యంగా వెనకబడ్డాడు. 12–17 వద్ద రెండు పాయింట్లు గెలిచాడు.
ఆ వెంటనే పొపోవ్ 20–16 లీడ్లోకి దూసుకెళ్లినా.. తరుణ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. బలమైన స్మాష్లు, ర్యాలీలతో వరుసగా ఆరు మ్యాచ్ పాయింట్లు కాపాడుకుని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్ల్లో లక్ష్యసేన్ 15–21, 17–21తో ఐదోసీడ్ కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడాడు. 57 నిమిషాల మ్యాచ్లో తొలి గేమ్లో లక్ష్య పూర్తిగా తేలిపోయాడు. రాస్మస్ గిమ్కే (డెన్మార్)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ వాకోవర్ ఇచ్చాడు.
శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 17–21, 11–21తో మూడోసీడ్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, ఆయుష్ షెట్టి 15–21, 16–21తో కున్లావట్ విటిడ్సార్న్ (థాయ్లాండ్) చేతిలో ఓడగా, కొకి వాటనాబే (జపాన్)తో జరిగిన మ్యాచ్లో స్కోరు 10–21, 1–4 ఉన్న దశలో కిరణ్ జార్జ్ రిటైర్డ్హర్ట్ అయ్యాడు. దాంతో ఈ టోర్నీలో ఇండియా నుంచి తరుణ్ మాత్రమే పోటీలో నిలిచాడు.