రాష్ట్రం అప్పులతో ఆగమాగం

రాష్ట్రం అప్పులతో  ఆగమాగం

అద్భుతమైన సంపద ఉన్న ప్రాంతం, దేశంలోనే ధనిక రాష్ట్రం, 2014లో అదనపు ఆదాయం ఉన్న తెలంగాణ ఈరోజు అప్పుల కుప్ప అయింది. రాష్ట్రం భవిష్యత్ అంధకారంగా మారింది. సహజ వనరులు, ఆదాయ మార్గాలు పుష్కలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశంలో వెలిగిపోతుందనుకుంటే దాదాపు రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. సగటు అప్పులు రూ.88 వేలకు చేరటంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు సర్​ప్లస్​ బడ్జెట్​తో దేశంలోనే ధనిక రాష్ట్రంగా నిలిచింది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి (దాదాపు 70 ఏళ్లలో) కేవలం రూ.60 వేల కోట్ల అప్పుల్లోనే ఉన్న తెలంగాణ ప్రస్తుతం దాదాపు రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అంటే ఏటా సుమారు రూ.40 వేల కోట్ల అప్పులు తెచ్చిన ఘనత  ప్రస్తుత పాలకులకే దక్కింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే సహజ వనరులు ఉన్న తెలంగాణ అదనపు ఆదాయంతో ధనిక రాష్ట్రంగా వెలిగిపోతుందని జనం భావించారు. తీరా టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ​సీఎం అయ్యాక తెలంగాణ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయింది.

దొరికిన చోటల్లా రుణాలు తెచ్చారు

మనది ధనిక రాష్ట్రమని, నిధులకు ఎలాంటి కొరత లేదని పదే పదే చెప్పుకొచ్చిన కేసీఆర్​ చివరికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. మొన్న​ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్​ను పరిశీలిస్తే తెలంగాణ ప్రజలపై ఉన్న భారం బయటపడింది. దాదాపు రూ.3 లక్షల కోట్ల అప్పుల భారం తెలంగాణ మోయాల్సి వస్తోంది. 2016లో రూ.లక్షా 30 వేల కోట్లు ఉన్న అప్పులు 2018 నాటికి రూ.లక్షా 80 వేల కోట్లకు చేరాయి.
అంటే ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పు చేసినట్లు తెలిసిపోతోంది.

అలాగే, ఈ ఏడాది రెవెన్యూ లోటు రూ.24 వేల కోట్లు చూపారు. దాన్ని కూడా అప్పులు తెచ్చి పూడుస్తారన్న మాట. అటు బడ్జెట్​ అప్పులు, ఎఫ్​ఆర్​బీఎం చట్టం అడ్డు వస్తుందనే నెపంతో బడ్జెటేతర అప్పులు, చిన్న మొత్తాల పొదుపు సంస్థల నుంచి తెచ్చిన రుణాలు, కేంద్రం ఇచ్చిన లోన్లు, అటానమస్​ సంస్థల వద్ద తీసుకున్న రుణాలు కలిపి దాదాపు రూ. 3 లక్షల కోట్ల వరకు రాష్ట్రం అప్పులు చేసింది. వాటికి ఏటా వడ్డీ సుమారు రూ.14,600 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. దీన్నిబట్టి రాష్ట్రంపై అప్పుల భారం ఎంత ఉందో అర్థమవుతోంది.

సహజంగా ఏ ప్రభుత్వమైనా అప్పులను ఉత్పాదక వ్యయంగా ఖర్చుచేస్తుంది. ఆయా ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయంతో రుణాలు తీరుస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు రూ. 33 వేల కోట్లు, మిషన్​ భగీరథకు రూ.23 వేల కోట్లు, ఇతర పథకాలకు మరో రూ.23 వేల కోట్లు అప్పులు తెచ్చింది. అంటే బడ్జెట్​లో చూపించే రుణాలు కాకుండా సర్కారు మరో రూ.78 వేల కోట్లు బడ్జెటేతర అప్పులు చేసింది.

ఎలాంటి ఉత్పత్తి రాకున్నా ఈ అప్పులకు మాత్రం ప్రభుత్వం దాదాపు రూ.14,600 కోట్ల వడ్డీని బడ్జెట్​లో పెట్టాలి. తెలంగాణ వాస్తవ ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే సీఎం కేసీఆర్​ ఇటీవల పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన సందర్భంగా గొప్పలు చెప్పారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని, నిధులకు ఎలాంటి కొరత లేదని, పొద్దున బిల్లులు పంపితే సాయంత్రానికల్లా నిధులు విడుదల చేస్తామని అన్నారు. వాస్తవ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.

వారం రోజుల్లోనే వాస్తవం తెలిసొచ్చిందా?

గతంలో ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో రూ.లక్షా 82 వేల కోట్లు చూపారు. మొన్న ప్రవేశపెట్టిన అసలు బడ్జెట్​ మాత్రం రూ.లక్షా 46 వేల కోట్లే. దీన్నిబట్టి బడ్జెట్​లో దాదాపు రూ.36 వేల కోట్లు కోత పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన తర్వాత వారం రోజుల్లోనే కేసీఆర్​ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రూ.36 వేల కోట్లు తగ్గించారా? దానికితోడు రూ.24 వేల కోట్ల రెవెన్యూ లోటు చూపిస్తున్నారు. దీనివల్ల మొత్తంగా దాదాపు రూ.60 వేల కోట్ల లోటు కనిపిస్తోంది.

ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.60 వేల కోట్ల లోటు చూపెడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రమని, ఆదాయానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి చెప్పటంలో అర్థమేంటి?, మరో వైపు అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లలకు పాలు ఇచ్చేందుకు నిధులు లేకపోవటంతో డైరీ కేంద్రాల నుంచి వాటికి పాల సరఫరా బంద్​ అయింది. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు గుడ్ల సరఫరా లేదు. 108 అంబులెన్స్​ల ఉద్యోగులకు జీతాలు లేవు. కాంట్రాక్ట్​ ఉద్యోగులకు వేతనాలు సరిగా రావటంలేదు.

పీఆర్​సీ ఏదీ ?

ఉద్యోగులకు పీఆర్​సీ ప్రకటించలేదు. ఆర్​టీసీ విలీనం చేయాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్​లో తెలంగాణ ఇంకా ఎంత గందరగోళంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. సొంత పాలనలో తెలంగాణ బంగారు రాష్ట్రంగా మారుతుందని భావించి, అన్నింటికీ తెగించి ఉద్యమం చేస్తే ఈ ముఖ్యమంత్రి చేతిలో తెలంగాణ పూర్తి భిన్నంగా మారిపోయింది.  రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారం పడినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు. కొత్తగా ఒక్క పరిశ్రమా ఏర్పాటుకాలేదు. చట్టం ప్రకారం మనకు రావాల్సిన బయ్యారం స్టీల్​ ఫ్యాక్టరీ గానీ, కాజీపేట కోచ్​ ఫ్యాక్టరీ గానీ, జాతీయ ప్రాజెక్టు గానీ, ఐటీఐఆర్​ గానీ ఏదీ రాలేదు. వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అవసరంలేని ప్రాజెక్టుల మీద వెచ్చిస్తున్నారు. అందువల్ల ఆర్థికవేత్తలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు గొంతెత్తాలి. తెలంగాణ కోసం ఉద్యమించినవారు మళ్లీ ముందుకు వచ్చి రాష్ట్రాన్ని అప్పుల భారం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.