
- ఏడాదిలోనే ఆరు గ్యారంటీలు
- ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ
- రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వక్తలు
వెలుగు, నెట్వర్క్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తూ నిరుపేదలను ఆదుకుంటోందని తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఏడాది కాలంలోనే ఆరు గ్యారంటీలు అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకలకు బండ ప్రకాశ్ చీఫ్గెస్ట్గా హాజరయ్యారు.
పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదలకు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో దేశానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో జిల్లాలోని కోటీ లక్ష మంది మహిళలకు ఉచితంగా ప్రయాణించి రూ.44.73 ఆదా చేసుకున్నారని అన్నారు.
రూ.500కే వంటగ్యాస్ సరఫరా చేసి మహిళలపై ఆర్థిక భారం తగ్గించామని అన్నారు. జిల్లాలో అర్హులైన 72,817 కుటుంబాలకు రూ.31.58 కోట్ల రాయితీ అందించామని తెలిపారు. ఎనిమిది నెలల కాలంలో 25,35,964మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.465 కోట్లు అందించామని తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ఉన్న చిల్డ్రన్స్పార్క్ లోని అమరవీరుల స్థూపానికి ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీశ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు నివాళులర్పించారు.
రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి
రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 8 నెలలల్లోనే 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేశామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే వంటగ్యాస్ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించారు.
పేదల చెంతకు ప్రభుత్వ పథకాలు
ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకెళ్తూ నెంబర్ వన్గా నిలుస్తోందన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.
నార్నూర్ బ్లాక్లో అత్యుత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌక్లోని అమరవీరుల స్థూపం, జయశంకర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.
సింగరేణిలో ఆవిర్భావ వేడుకలు
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, జైపూర్ ఎస్టీపీపీలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై సింగరేణి యాజమాన్యాలు, కార్మిక సంఘాలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జీఎంలు జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి చేస్తూ వేలాది మందికి ఉపాధిని కల్పిస్తూ సింగరేణి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా విరాజిల్లుతోందన్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో అధికారులు, నేతలు, ప్రజలు వేడుకల్లో భాగమయ్యారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నయ్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్ కలెక్టరేట్ వద్ద జరిగిన వేడుకల్లో సిరిసిల్ల రాజయ్య చీఫ్గెస్ట్గా పాల్గొన్నారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్తరేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలతో ప్రభుత్వం ప్రజలకు చేయూత అంస్తోందన్నారు. రుణమాఫీ ద్వారా లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో డ్రగ్స్ నిర్ములనకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ కలెక్టర్, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.