- యూనియన్ లీడర్లకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లకు అనుమతి
- భార్యాభర్తలకు పాయింట్లు ఇవ్వడాన్ని సమర్థించిన కోర్టు
- స్పౌజ్ నిబంధనల్లో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని వెల్లడి
- వెంటనే బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని పలు టీచర్ సంఘాల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: టీచర్ల ట్రాన్స్ఫర్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూనియన్ నేతలకు పది అదనపు పాయింట్లు ఇవ్వరాదని తేల్చి చెప్పింది. స్పౌజ్లకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని సమర్థించింది. ప్రభుత్వ ఉద్యోగులైన (కేంద్ర, రాష్ట్ర) భార్యాభర్తలు కలిసి ఉండాలని, వీళ్లకు సంబంధించిన నిబంధనల్లో జోక్యం చేసుకోవడం లేదని తెలిపింది. బదిలీలపై ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 5పై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ, ట్రాన్స్ఫర్లకు అనుమతి ఇచ్చింది.
అయితే, బదిలీలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్ కుమార్ల బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్యా చట్టంలోని సెక్షన్ 78(2) ప్రకారం బదిలీలు, ప్రమోషన్స్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చింది. జీవో 9, జీవో 5లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు గతంలో ఇచ్చిన బదిలీల ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది.
ట్రాన్స్ఫర్లు చేసే అధికారం రాష్ట్రానికి లేదు..
పిటిషనర్ల తరఫు లాయర్లు చిక్కుడు ప్రభాకర్, పీవీ కృష్ణయ్య వాదిస్తూ, విద్యా చట్టంలోని సెక్షన్ 78, 79 ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసే అధికారం రాష్ట్రానికి లేదన్నారు. చట్ట ప్రకారం రూల్స్ తయారీకి ముందు ప్రభుత్వ జీవో 317 ద్వారా గత జనవరిలోనే ట్రాన్సఫర్లు చేసిందన్నారు. సంఘాల నేతలకు, భార్యాభర్తలకు అదనపు పాయింట్లు ఇవ్వడం వివక్ష అవుతుందన్నారు. రిట్లు వేశాక అసెంబ్లీలో టీచర్ల ట్రాన్స్ఫర్ల రూల్స్ ప్రవేశపెట్టారని, దీనిపై చర్చ కూడా చేయలేదని, ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
రాజ్యాంగంలోని 309 అధికరణం కింద చట్టసభలకే అధికారం ఉందన్నారు. చట్టం లేకుండా రూల్స్ చేస్తే చెల్లవన్నారు. గవర్నర్ లేదా అథీకృత ఆఫీసర్ అనుమతి ఉండాలని, ఇది కూడా లేకుండానే బదిలీలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. తెలంగాణ విద్యా చట్టంలో, స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం బదిలీలు చేయవచ్చని చెప్పారు. ఇవి అమలు చేయకుండా కొత్త రూల్స్ ప్రకారం ట్రాన్సఫర్స్ చేయడం చెల్లదన్నారు.
ఆ పవర్ సర్కార్కు ఉంటది..
ప్రభుత్వ తరఫున అదనపు ఏజీ జె.రామచందర్రావు వాదిస్తూ, రాజ్యాంగంలోని 309 అధికరణ కింద ట్రాన్సఫర్స్ చేసేందుకు రూల్స్ తయారీ అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆగస్టు 5న అసెంబ్లీలో రూల్స్ ప్రవేశపెట్టి అనుమతి పొందిందన్నారు. రాష్ట్ర విద్యా చట్టంలోని సెక్షన్ 78, 79 ప్రకారం బదిలీ చేసే పవర్ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. అన్నీ ఆలోచించాకే ఉపాధ్యాయ సంఘాల నేతలకు, భార్యాభర్తలకు అదనపు పాయింట్లు ఇచ్చామన్నారు. టీచర్ల సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వీలుగా అదనపు పాయింట్లు ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు.
గతంలో ఇదే తరహాలో బదిలీల నిబంధనలను ప్రభుత్వం తెచ్చిందని సీనియర్ అడ్వొకేట్ సురేందర్రావు చెప్పారు. 2018లో జీవో 15 తెచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ విద్యా చట్టం 2005లో రూపొందిన రూల్స్ అమల్లో లేవన్నారు. వేమారెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఆ రూల్స్ను హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. కాగా, ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు బదిలీలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. వివాదస్పద అంశాల జోలికి వెళ్లడం లేదని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులతో ఆగిన బదిలీలు కొనసాగేలా ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
టీచర్ల సంఘాల హర్షం..
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై హైకోర్టు స్టే ఎత్తి వేయడాన్ని టీచర్ల సంఘాలు, స్పౌజ్ ఫోరం నాయకులు స్వాగతించారు. స్పౌజ్ పాయింట్లను కొనసాగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పౌజ్ ఫోరం రాష్ట్ర నాయకులు నందారం జైపాల్ రెడ్డి, వివేక్, వారణాసి శివశంకర్, మల్లేపల్లి నరేందర్ రెడ్డి, వెంకటరమణ, నరేశ్ సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే షెడ్యూల్ ప్రకటించి ప్రక్రియ కొనసాగించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అశోక్ కుమార్, కటకం రమేశ్, టీఎస్ పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ, హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ తదితరులు వేర్వేరు ప్రకటనల్లో కోరారు.