హైదరాబాద్, వెలుగు: నిజాం పాలన నుంచి విముక్తి లభించిన ‘సెప్టెంబర్ 17’ను పురస్కరించుకుని నిర్వహించే ప్రోగ్రామ్పై రాష్ట్ర సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. నిరుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది. అప్పుడు దీనికి పోటీగా రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాలను జరిపింది. ఈసారి సీన్ మారింది. ఇప్పుడు సెప్టెంబర్ 17 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నడుస్తున్నది. రెండు జాతీయ పార్టీలు పరేడ్ గ్రౌండ్ను వేదికగా చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి స్వాతంత్ర్య దినోత్సవంగా వేడుకలు జరుపుతామని చెప్తున్నది. నిరుటిలానే పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఉంటాయని బీజేపీ అంటున్నది. ఇందు కోసం రెండు పార్టీలు వేగంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ విషయంలో ఎట్ల ముందుకు వెళ్లాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నది.
నిరుడు మూడు రోజులు
తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2022లో తప్ప రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 ఉత్సవాలను అధికారికంగా నిర్వహించలేదు. నిరుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే అధికారిక కార్యక్రమం చేయడంతో.. దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఏకంగా మూడు రోజుల పాటు ‘జాతీయ సమైక్యత’ పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల్లో ‘సెప్టెంబర్ 17’ కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి దాదాపు రూ.30 లక్షలు చొప్పున ఖర్చు చేసింది. ఈసారి ఎలక్షన్లు ఉండటంతో రెండు జాతీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలకు ప్లాన్ చేస్తుండటంతో బీఆర్ఎస్కు మింగుడు పడటం లేదు. ఎట్లయినా సరే ఆ రెండు పార్టీల వేడుకలను తలదన్నేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోగ్రామ్ పెట్టాలని అనుకుంటున్నది. ఏం చేయాలనే దానిపై ఉన్నతాధికారులకూ సీఎం టాస్క్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈసారి కూడా గతంలో మాదిరి బహిరంగ సభ పెట్టాలా లేదంటే పబ్లిక్ గార్డెన్లో జెండా ఎగురవేసి సైలెంట్ గా ప్రోగ్రామ్నిర్వహిస్తే ఎట్ల ఉంటుందనే దానిపైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.