గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో?

గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో?

ఏర్పాట్లు చేస్తున్న టీఎస్​పీఎస్సీ 
హైదరాబాద్, వెలుగు :
గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నది. ఇందుకోసం డిపార్ట్​మెంట్ల హెచ్​ఓడీలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. మూడురోజుల కింద గ్రూప్2, గ్రూప్ 3 పోస్టులతో పాటు మరో 9 డిపార్ట్​మెంట్లకు చెందిన 2,910 పోస్టుల భర్తీకి ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో గ్రూప్​2 పోస్టులు గతంలో సర్కారు ప్రకటించిన సంఖ్యతో పోలిస్తే పెరిగాయి. గతంలో 582 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం..  తాజాగా 663 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. మరోపక్క గ్రూప్​ 3 పోస్టులు 1,373 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. జనవరిలో రాతపరీక్షలు నిర్వహించే అవకాశముంది. గురువారం టీఎస్​పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్​రెడ్డి నేతృత్వంలో అగ్రికల్చర్, హౌసింగ్, సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఫిషరీస్, టెక్నికల్ అండ్ కాలేజేట్ ఎడ్యుకేషన్, వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్​బెండరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ తదితర డిపార్ట్మెంట్ల ప్రతినిధులతో కమిషన్ అధికారులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సర్వీస్ రూల్స్, అమైన్​మెంట్స్, క్యారీ ఫార్వర్డ్ వెకెన్సీలు, క్వాలిఫికేషన్లు, రోస్టర్ తదితర అంశాలపై చర్చించారు. శుక్ర, శనివారాలు కూడా గ్రూప్​ 2, 3 పోస్టుల్లోని వివిధ డిపార్ట్​ మెంట్ల అధికారులతో చర్చించనున్నారు. వారంలోపు వారి నుంచి మరోసారి వివరాలను సేకరించనున్నారు. దాంట్లోనూ ఏమైనా తప్పులుంటే, సరిచేసేందుకు అవకాశమిస్తారు. అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి ఫైనల్ ఇండెంట్ వచ్చిన వారంలోపే నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఈనెలాఖరులోపు గ్రూప్​ 2 నోటిఫికేషన్, దాని తర్వాత వారం, పదిరోజుల్లోపే గ్రూప్ 3 నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్టు పేర్కొంటున్నారు.