సూర్యాపేట/కరీంనగర్, వెలుగు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల క్యాంప్ ఆఫీసులను ముట్టడించారు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పలుచోట్ల తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకటిరెండు చోట్ల పోలీసులు స్టూడెంట్లపై లాఠీచార్జి చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి క్యాంప్ ఆఫీస్ లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. దీంతో స్టూడెంట్లు బైఠాయించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు లాఠీచార్జ్చేసి కొంతమంది స్టూడెంట్ లీడర్లను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు.
ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న రూ. 5,300 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలు రిలీజ్ చేయాలని ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ డిమాండ్ చేశారు. అలాగే కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆఫీసు గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని మెడలు పట్టుకుని లాక్కెళ్లారు. తర్వాత పలువురిని అరెస్టు చేశారు. ఖాళీగా ఉన్న 15వేల టీచర్పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు అజయ్, రాకేశ్, సాయి, రంజిత్ అన్నారు