యువవికాసంతో యువతకు మేలు..రూ.50వేల నుంచి 4 లక్షల వరకు లోన్లు: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

యువవికాసంతో యువతకు మేలు..రూ.50వేల నుంచి 4 లక్షల వరకు లోన్లు: ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి
  • బొగ్గు బ్లాకుల టెండర్లలో సింగరేణి పాల్గొనాలె
  • కొత్త గనులకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేయాలి
  • మందమర్రిలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం

కోల్​బెల్ట్, వెలుగు : యువతకు స్వయంఉపాధి కల్పించేందుకు రాజీవ్​యువ వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని బీ1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్​లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత అభ్యున్నతి కోసమే రాజీవ్​యువ వికాసం స్కీంను కాంగ్రెస్ సర్కార్​ అమల్లోకి తీసుకువస్తున్నదన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్​2న స్కీంను సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభిస్తారని, 5 లక్షల మందికి శాంక్షన్​లెటర్స్​అందించాలని సర్కార్ టార్గెట్ పెట్టుకుందన్నారు. రూ.50వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారన్నారు. ఈ స్కీం, వర్తింపుపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. రాజీవ్​యువ వికాసం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందుతుందన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్​కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించారని, అర్హులకు పథకం వర్తింపజేస్తారన్నారు.

కొత్త గనులు రాకపోతే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం

కొత్త బొగ్గు గనులు రాకపోతే రానున్న కాలంలో సింగరేణి మనుగడతో పాటు కోల్​బెల్ట్ ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని వివేక్​వెంకటస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు గనుల వేలం పాటలో సింగరేణి టెండర్లు వేయాలని సూచించారు. నేరుగా బొగ్గు గనుల అలాట్మెంట్ చేసుకుంటే సింగరేణి సంస్థ పన్నురూపంలో 14 శాతం అధిక రాయల్టీ కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొని బొగ్గు గనులు దక్కించుకుంటే పన్ను చెల్లించనవసరం లేదన్నారు.

సింగరేణిలో కొత్త గనులు తీసుకవచ్చేందుకు సీఎం రేవంత్​రెడ్డి కృషి చేయాలని కోరారు. సింగరేణి సంస్థ టెండర్ ప్రక్రియలో పాల్గొని కొత్త గనులు, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా అన్ని పొలిటికల్ పార్టీలు చొరవచూపాలన్నారు. కొత్త గనులతో భవిష్యత్​లో సింగరేణి కష్టాలు తీరుతాయని చెప్పారు. సమావేశంలో మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలుపాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వాదించిన ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరశాల గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన గొడిశెల సాయిచరణ్​రెడ్డి-నవ్యరెడ్డి రిసెప్షన్ వేడుకలకు చెన్నూరు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు.