
వాయుగుండంగా తీవ్ర అల్పపీడనంగా మారింది. గురువారం తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో కుండపోత వానలు ఖాయమని ఐఎండీ పేర్కొంది. ఆంధ్రాలోని పశ్చిమ గోదావరి, మన్యం తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. మే 31 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
రాష్ట్రంలో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం నాటికి తెలంగాణ అంతటా విస్తరించాయి. సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. 2 రోజుల్లోనే అన్ని జిల్లాలకు వ్యాపించాయి. తొలి రోజు 4 జిల్లాల్లోకి ఎంటరయ్యాయి. ఆ మర్నాడు కేవలం మహబూబ్నగర్ వరకే విస్తరించాయి. బుధవారం నాటికి రాష్ట్రమంతా వ్యాపించాయి.
ప్రస్తుతం రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. మిగతా 3 రోజులకు రాష్ట్రమంతటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.