- ఇండియా అండర్-18 టీమ్కు ఎంపిక
- ఈ ఘనత సాధించిన తెలంగాణ
- తొలి ప్లేయర్గా 16 ఏండ్ల యంగ్ స్టర్ రికార్డు
హైదరాబాద్, వెలుగు: బాస్కెట్బాల్లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న తెలంగాణ యంగ్స్టర్ యేలేటి ప్రీతమ్ రెడ్డి రాష్ట్రం గర్వించేలా చేశాడు. అతను ఇండియా టీమ్కు సెలెక్ట్ అయ్యాడు. 16 ఏండ్లకే అండర్ 18 జట్టులో చోటు దక్కించుకొని శభాష్ అనిపించాడు. ఈ కేటగిరీలో తెలంగాణ నుంచి నేషనల్ టీమ్కు ఎంపికైన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఫిఫా మెన్స్ ఏషియన్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్లో ప్రీతమ్ ఇండియా జట్టు తరఫున పోటీ పడనున్నాడు. ఈ టోర్నీ ఈనెల 21 నుంచి 28 వరకు ఇరాన్లోని టెహ్రాన్లో జరుగుతుంది. చిన్న వయసులోనే, తక్కువ టైమ్లోనే నేషనల్ టీమ్లోకి వచ్చి ఆటపై తనదైన ముద్ర వేస్తున్న ప్రీతమ్ ప్రతిష్టాత్మక ఎన్బీఏలో ఆడటమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు.
సరదాగా మొదలై..
ప్రతిభ ఉన్న చిన్నారులకు పేరెంట్స్ సపోర్ట్, సరైన గైడెన్స్, నాణ్యమైన కోచింగ్ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేందుకు ప్రీతమ్ జర్నీనే ఉదాహరణ.
ప్రీతమ్ చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవాడు. క్రికెట్, షటిల్, బాస్కెట్బాల్ ఆడేవాడు. హైదరాబాద్ కొంపల్లిలో తన కాలనీలో దోస్తులతో కలిసి బాస్కెట్బాల్ ఆడుతూ ఈ ఆటపై ఇష్టం పెంచుకున్నాడు. తండ్రి సురేశ్ రెడ్డి ప్రోత్సాహంతో 11 ఏండ్ల వయసులో ఈ ఆటను కెరీర్గా ఎంచుకున్నాడు. కోచ్ సంపత్ దగ్గర ఆటలో మెళకువలు నేర్చుకొని హైదరాబాద్ జిల్లా జట్టు తరఫున తెలంగాణ స్టేట్ లెవెల్ పోటీల్లో సత్తా చాటి వెలుగులోకి వచ్చాడు. ఈ క్రమంలో 2013లో ఢిల్లీలో జరిగిన రిలయన్స్ ఫౌండేషన్ జూనియర్ ఎన్బీఏ ప్రోగ్రామ్లో పాల్గొనడం అతని కెరీర్కు ప్లస్ అయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్ల ఆట చూసిన ప్రీతమ్ వాళ్లను దాటి తాను ముందుకెళ్లాలంటే ఎంత కష్టపడాలో అర్థం చేసుకున్నాడు. అదే టైమ్లో తన కొడుకులో టాలెంట్ ఉందని గుర్తించిన సురేశ్ రెడ్డి అతడిని అమెరికా ఫ్లోరిడాలోని ఐఎంజీ బాస్కెట్బాల్ అకాడమీలో చేర్చారు. ఇది ప్రీతమ్ కెరీర్ను మలుపుతిప్పింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఈ అకాడమీలో దాదాపు నాలుగేళ్ల పాటు అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ తీసుకున్న ప్రీతమ్ ఆటలో రాటు దేలాడు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్లేయర్లతో కలిసి ఆడుతూ గేమ్తో పాటు తన మెంటల్, ఫిజికల్ స్ట్రెంత్ పెంచుకున్నాడు. అక్కడే చదువుతూ పదో తరగతి కంప్లీట్ చేశాడు. 6.5 అడుగుల ఎత్తున్న ఈ యంగ్స్టర్ కోర్టులో పాదరసంలా కదులు తాడు. షూటింగ్ గార్డ్, స్మాల్ ఫార్వర్డ్ ఫొజిషన్లో టీమ్ గేమ్ ఆడటంలో దిట్ట అయిన ప్రీతమ్ అమెరికా నేషనల్ టీమ్కు కూడా క్రమంగా దగ్గరవుతున్నాడు.
సెలవుల కోసం వచ్చి నేషనల్ టీమ్కు
ప్రీతమ్ నేషనల్ టీమ్కు సెలెక్ట్ అవడమే అనూహ్యం. ఎందుకంటే నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్న ప్రీతమ్ స్కూల్కు సెలవులు రావడంతో ఈ మధ్యే హైదరాబాద్కు తిరిగొచ్చాడు. ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలిలోని కీస్టోన్ అకాడమీకి వెళ్లాడు. అక్కడ అతని ఆటను చూసిన కోచ్లు సంపత్, నార్మన్ ఇసాక్ ఇంప్రెస్ అయ్యారు. తను ఉండాల్సింది నేషనల్ టీమ్లో అని.. ప్రీతమ్ ఆడుతున్న వీడియోలను ఇండియా సెలెక్టర్లకు పంపించారు. హైదరాబాద్ ప్లేయర్ స్కిల్స్ చూసిన సెలెక్టర్లు వెంటనే నేషనల్ క్యాంప్నకు ఎంపిక చేశారు. క్యాంప్లోనూ ఆకట్టుకోవడంతో ప్రీతమ్ ఇప్పుడు జాతీయ జట్టులోకి వచ్చాడు. ‘16 ఏండ్లకే అండర్18 టీమ్కు ఎంపికవడం గొప్ప విషయం. ఇది రాష్ట్రానికి గర్వకారణం. అండర్16 ఏషియన్ చాంపియన్షిప్ ఉన్నా కూడా అండర్18 ఏషియాడ్కు సెలెక్ట్ అయ్యాడంటేనే ప్రీతమ్ టాలెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు’ అని తెలంగాణ బాస్కెట్ బాల్ సంఘం సెక్రటరీ నార్మన్ ఇసాక్, కోచ్ సంపత్ అంటున్నారు. ఇదే జోరుతో దూసుకెళ్తే ప్రీతమ్ ఇండియా సీనియర్ టీమ్తో పాటు ఎన్బీఏలో ఆడే అవకాశాలు పుష్కలం.
కల నిజమైంది
ఇండియాకు ఆడాలన్న నా కల నిజమైంది. అండర్18కి సెలెక్ట్ అయిన తెలంగాణ తొలి ప్లేయర్ నేనే అంటే నమ్మబుద్ధికావడం లేదు. మా పేరెంట్స్ సపోర్ట్తోనే నేషనల్ టీమ్కు ఆడే స్థాయికి వచ్చాను. నా కష్టానికి కొంచెం అదృష్టం కూడా తోడైంది. ఐఎంజీలో ట్రెయినింగ్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఏషియాడ్లో బాగా రాణించి రాబోయే వరల్డ్ కప్నకు సెలక్ట్ అవ్వాలన్నది నా లక్ష్యం. ఎన్బీఏకు ఆడాలన్నది నా గోల్. నాలుగైదేళ్లలో దీన్ని నెరవేర్చుకుం టానన్న నమ్మకం ఉంది. -ప్రీతమ్ రెడ్డి
