
- మూడు గోల్డ్ సహా 4 మెడల్స్ సొంతం
- మెన్స్ డబుల్స్లో అలీ- వన్ష్ జంటకు సిల్వర్
హైదరాబాద్, వెలుగు: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ గోల్డెన్ పంచ్ను మరిచిపోకముందే మరో తెలంగాణ బిడ్డ రాష్ట్రం గర్వపడేలా చేసింది. ఇండియా టేబుల్ టెన్నిస్ స్టార్, హైదరాబాదీ ఆకుల శ్రీజ మరోసారి నేషనల్ చాంపియన్గా నిలిచింది. జమ్మూలో జరిగిన ఇంటర్ స్టేట్ సీనియర్ నేషనల్ టీటీ చాంపియన్షిప్లో శ్రీజ మూడు గోల్డ్ సహా నాలుగు మెడల్స్తో దుమ్మురేపింది. విమెన్స్ సింగిల్స్, డబుల్స్, విమెన్స్ టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ నెగ్గిన ఆమె మిక్స్డ్ డబుల్స్లో బ్రాంజ్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండుసార్లు నేషనల్ చాంపియన్గా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. మెన్స్ డబుల్స్లో స్టేట్ ప్లేయర్లు మొహమ్మద్ అలీ, వన్ష్ సింఘాల్ సిల్వర్ సిల్వర్తో మెరిశాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ తరఫున బరిలోకి దిగిన శ్రీజ టోర్నీ అసాంతం సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. సోమవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంప్ శ్రీజ 4–2 తేడాతో సుతీర్థ ముఖర్జీ (బెంగాల్)ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. ఆపై డబుల్స్లో దియా చితాలెతో కలిసి ఆడిన శ్రీజ తుది పోరులో 3–1తో స్వస్తికా ఘోశ్–శ్రుతి అమృతే (మహారాష్ట్ర) ద్వయాన్ని ఓడించి రెండో గోల్డ్ సొంతం చేసుకుంది. మిక్స్డ్ డబుల్స్లో మానుశ్ షాతో ఆడిన శ్రీజ సెమీస్లో ఓడి బ్రాంజ్తో సరిపెట్టింది. అంతకుముందే దివ్యా చితాలే, ఐహికా ముఖర్జీతో పాటు ఆకుల శ్రీజ ప్రాతినిధ్యం వహించిన ఆర్బీఐ విమెన్స్ జట్టు ఫైనల్లో 3–2తో తమిళనాడును ఓడించి గోల్డ్ సొంతం చేసుకుంది. ఇక, మెన్స్ డబుల్స్లో తెలంగాణ ఆటగాళ్లు మొహమ్మద్ అలీ, వన్ష్ సింఘాల్ సిల్వర్ నెగ్గారు. ఫైనల్లో ఈ ఇద్దరూ 0–3తో జీత్ చంద్ర–అంకుర్ (బెంగాల్) చేతిలో ఓడిపోయారు. కాగా, మెన్స్ సింగిల్స్ స్టార్ ప్యాడ్లర్ జి. సత్యన్ (పీపీబీ) 4–0తో హర్మీత్ దేశాయ్ (పీఎస్పీబీ)ని ఓడించి రెండోసారి నేషనల్ చాంపియన్గా నిలిచాడు.
అదరగొట్టిన ఆకుల
గతేడాది నేషనల్ చాంపియన్స్లో డబుల్ గోల్డ్ మెడల్స్, ఆపై కామన్వెల్త్ గేమ్స్లో శరత్ కమల్తో కలిసి మిక్స్డ్ డబుల్స్లో గోల్డ్ గెలిచినప్పటి నుంచి శ్రీజ పేరు ఇండియా టీటీలో మార్మోగిపోతోంది. ఆట, ర్యాంక్లో అంతకంతకూ మెరుగవుతున్న తెలంగాణ ప్లేయర్ మరోసారి తన సత్తా చూపెట్టింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన శ్రీజ సోమవారం ఏకంగా ఐదు మ్యాచ్లు ఆడింది. మిక్స్డ్ సెమీస్లో ఓడినా.. సింగిల్స్, డబుల్స్లో సెమీస్, ఫైనల్స్లో జోరు చూపెట్టింది. ముఖ్యంగా సింగిల్స్ టైటిల్ ఫైట్లో ఫైనల్లో సూపర్ పెర్ఫామెన్స్ చేసింది. మంచి ఫామ్లో ఉన్న సుతీర్థ నుంచి గట్టి పోటీని తట్టుకుంది. బలమైన ఫోర్హ్యాండ్, క్రాస్ కోర్ట్ షాట్లతో సుతీర్థ విసిరిన సవాల్ను శ్రీజ సమర్థవంతంగా తిప్పికొట్టింది. చాలా దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి పని పట్టింది. తొలి గేమ్లోనే 9–11తో కోల్పోయిన రెండో సీడ్ శ్రీజ గొప్పగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్ను 14–12తో నెగ్గింది. అదే జోరుతో తర్వాతి రెండు గేమ్స్ నెగ్గి 3–1తో లీడ్లోకి వచ్చింది. కానీ,ఐదో గేమ్లో తడబడింది. ఇక చివరిదైన ఆరో గేమ్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని శ్రీజ మరోసారి నేషనల్ చాంపియన్గా నిలిచింది. గోల్డ్తో పాటు రూ. 2.75 లక్షల ప్రైజ్మనీ సొంతం చేసుకుంది.