న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెలికం కంపెనీల ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.1.2 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.1.04 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం గ్రోత్కు సమానం. డేటా వినియోగం బాగా పెరిగిందని, అందుకే 2023–24 లో టెలికం కంపెనీల ప్రాఫిట్స్ పెరుగుతాయని వివరించింది. టారిఫ్ హైక్లు లేకపోయినప్పటికీ కంపెనీల యావరేజ్ పర్ యూజర్ (ఆర్పూ) రూ.190 కి పెరుగుతుందని, ఇది 8–10 శాతం గ్రోత్కు సమానమని క్రిసిల్ వెల్లడించింది.
4జీ నుంచి 5జీకి కస్టమర్లను మార్చడంపై కంపెనీలు ఫోకస్ పెడతాయని సంస్థ డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనిష్ గుప్తా అన్నారు. ఒక సబ్స్క్రయిబర్ నెలకు వాడే డేటా సగటున 23–25 జీబీలకు పెరుగుతుందని, కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 20 జీబీగా ఉందని పేర్కొన్నారు. టెలికం కంపెనీల ఖర్చులు స్థిరంగా ఉన్నాయని, ఆర్పూ పెరిగితే ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందని క్రిసిల్ పేర్కొంది. 2019–20 నుంచి 2022–23 మధ్య టెలికం కంపెనీ ఆపరేటింగ్ ప్రాఫిట్ రెండింతలు పెరిగిందని, ఇదే టైమ్లో కంపెనీల ఆర్పూ 1.4 రెట్లు ఎగిసిందని పేర్కొంది. దేశంలో ఎయిర్టెల్, జియో, వీ టాప్ టెలికం కంపెనీలు.