
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇంటర్నెట్ కంపెనీ గూగుల్ తమ సంస్థలో బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్ల) వరకు ఇన్వెస్ట్ చేయనుందని టెలికాం కంపెనీ ఎయిర్టెల్ శుక్రవారం ప్రకటించింది. భారతదేశ డిజిటల్ ఎకోసిస్టమ్ను మరింత ముందుకు తీసుకురావడానికి ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపింది. ‘‘గూగుల్ రాబోయే ఐదేళ్లలో ఈ డబ్బును సమకూరుస్తుంది. కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలు చేయడానికి అదనంగా 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఎయిర్టెల్ నుంచి ఒక్కో షేరును రూ.734 చొప్పున కొనడానికి 300 మిలియన్ డాలర్ల వరకు చెల్లిస్తుంది’’ ఎయిర్టెల్ పేర్కొంది. అందరికీ స్మార్ట్ఫోన్లను అందుబాటు ధరల్లో లభ్యమయ్యేలా చూడటం, ఇండియా కోసం ప్రత్యేకంగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు చేయడం, మనదేశంలోని అన్ని బిజినెస్ల కోసం క్లౌడ్ ఎకోసిస్టమ్ నిర్మించడంపై ఈ పార్ట్నర్షిప్ ఫోకస్ చేస్తుందని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. ఇన్నోవేటివ్ ప్రొడక్టుల ద్వారా గూగుల్, ఎయిర్టెల్ ఇండియాలో డిజిటల్ వాడకాన్ని మరింత పెంచుతాయని చెప్పారు. లేటెస్ట్ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, లాస్ట్మైల్ డిస్ట్రిబ్యూషన్, పేమెంట్స్ ఎకోసిస్టమ్ను డెవెలప్ చేస్తామని ప్రకటించారు. ‘‘ఎయిర్టెల్ భారతదేశం డిజిటల్ భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కనెక్టివిటీని పెంచడం కోసం ఈ కంపెనీతో కలసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎక్కువ మంది భారతీయులకు క్వాలిటీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేలా మేం ప్రయత్నిస్తాం” అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. తమ గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్కి యాక్సెస్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. స్మార్ట్ఫోన్లు మరింత మంది వాడేలా చూస్తామని, కొత్త బిజినెస్ మోడల్స్కు సాయపడటానికి కనెక్టివిటీని మెరుగుపర్చుతామని వివరించారు. ఇండియా క్లౌడ్ సేవల వాడకాన్ని పెంచడంపై రెండు కంపెనీలు దృష్టి పెడతాయని పిచాయ్ వివరించారు.