ఐడియా,వొడాఫోన్ కంపెనీలు 93వేలకోట్లు చెల్లించాలి

ఐడియా,వొడాఫోన్ కంపెనీలు 93వేలకోట్లు చెల్లించాలి

న్యూఢిల్లీ:

ప్రభుత్వరంగ బ్యాంకులు టెలికం కంపెనీలకు రూ.1.15 లక్షల కోట్ల అప్పులు ఇచ్చాయి. ఇది వరకే అప్పుల కుప్పగా మారిన టెలికం సెక్టార్‌‌‌‌కు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మింగుడుపడటం లేదు. అడ్జెస్టెడ్‌‌‌‌ గ్రాస్‌‌‌‌ రెవెన్యూ (ఏజీఆర్‌‌‌‌) బకాయిలు రూ.93 వేల కోట్లు చెల్లించాలని తీర్పు చెప్పడంతో వీటి నష్టాలు అమాంతం పెరిగాయి. వొడాఫోన్‌‌‌‌ ఐడియా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇండియాలో వ్యాపారం కొనసాగించడం సాధ్యం కాకపోతే, తాము లిక్విడేషన్‌‌‌‌కు వెళ్లే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామని కంపెనీ సీఈఓ రీడ్‌‌‌‌ ప్రకటించారు. దీంతో ప్రభుత్వ బ్యాంకుల్లో టెన్షన్‌‌‌‌ మొదలయింది. దివాలా పిటిషన్‌‌‌‌ దాఖలు చేసిన టెల్కోల నుంచి బకాయిలు రాబట్టడం అసాధ్యమని ఇవి ప్రభుత్వానికి తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెల్కోలు మూడు నెలల్లో రూ.93 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో తాజా క్వార్టర్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌, వొడాఫోన్ ఐడియా రూ.25 వేల కోట్లకుపైగా నష్టాన్ని ప్రకటించాయి. ‘‘ఏ ఒక్క టెల్కో దివాలా తీసినా బ్యాంకింగ్‌‌‌‌ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే టెల్కోలు మాకు పెద్ద మొత్తంలో బకాయిపడ్డాయి. డాట్‌‌‌‌కు ఇవి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీల విలువ రూ.వేల కోట్లలో ఉంది. టెల్కోల దివాలాకు అనుమతించాలా, ఏదైనా పరిష్కారం కనుక్కోవాలా అనే విషయంలో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాలి’’ అని ఒక బ్యాంకర్‌‌‌‌ చెప్పారు. ఆర్‌‌‌‌కామ్‌‌‌‌, ఎయిర్‌‌‌‌సెల్‌‌‌‌ దివాలా తీశాక, వాటి నుంచి బకాయిలు వసూలు కాని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. టెల్కోలు కొల్లటేరల్‌‌‌‌గా స్పెక్ట్రమ్‌‌‌‌ను మాత్రమే పెట్టాయి. ఈ విషయంలో వాటికి డాట్‌‌‌‌తో వివాదాలు ఉన్నాయి. బ్యాంకులకు ప్రమోటర్లు పర్సనల్‌‌‌‌ గ్యారంటీగానీ కార్పొరేట్‌‌‌‌ గ్యారంటీ గానీ ఇవ్వలేదు. ప్రభుత్వానికి టెల్కోలు స్పెక్ట్రమ్‌‌‌‌ చార్జీల రూపంలో రూ.40 వేల కోట్లు చెల్లించాలి. లైసెన్సు ఫీజులుగా రూ.39 వేల కోట్లు కట్టాలి. వీటికి ఏజీఆర్‌‌‌‌ బకాయిలు అదనం.  బకాయిల వడ్డీ, పెనాల్టీలను తగ్గించాలన్న టెల్కోల వినతులను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ‌‌‌‌  ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌కు అమ్ముడుపోయిన టాటా టెలిసర్వీసెస్‌‌‌‌  కూడా సుమారు రూ.13 వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి.

అప్పుల కుప్పగా మారిన టెలికం పరిశ్రమ

ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఈ పరిశ్రమకు రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తీర్పు నుంచి ఇండస్ట్రీకి కాస్త ఊరట కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. వడ్డీలు, పెనాల్టీల్లో తగ్గింపు వంటి ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. పేమెంట్ల కోసం లాంగర్ టెన్యూర్‌‌‌‌‌‌‌‌ను అనుమతించడం, లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వాడకపు ఛార్జీలు తగ్గించడం వంటి వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.  కొంతైనా ఊరటనివ్వకపోతే.. వొడాఫోన్ ఐడియా దివాలా తీసే ప్రమాదముందని కూడా కొందరు విశ్లేషకుల అభిప్రాయం.  టెలికం రంగానికి మినహాయింపులు ఇస్తే అది బ్యాంకింగ్​ రంగానికి కూడా ప్రయోజనమేనని వారు అంటున్నారు.