- మంత్రి పొన్నంను కోరిన గెటెడ్ కమ్యూనిటీల ప్రతినిధులు
రామచంద్రాపురం, వెలుగు: ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన తెల్లాపూర్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి, జీహెచ్ఎంసీ ఇన్చార్జి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఈశ్వరిగారి రమణ మాట్లాడుతూ.. తెల్లాపూర్లో ప్రస్తుతం క్యాపిటల్ వాల్యూ ఆధారంగా 200 శాతం అదనంగా ప్రాపర్టీ ట్యాక్స్లను చెల్లిస్తున్నామని వెంటనే రెంటల్ వాల్యూ విభాగంలోకి మార్చాలని కోరారు. రేడియల్ రోడ్డు 30 పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇంటర్నల్ రోడ్లు కూడా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.
వందల సంఖ్యలో ఉన్న గేటేడ్ కమ్యూనిటీలకు ఒక్క ఎస్టీపీ వ్యవస్థ లేదని దీనివల్ల నిత్యం డ్రైనేజీ సమస్యలు వస్తున్నాయని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ సరఫరాను తెల్లాపూర్కు వర్తింపజేయాలని కోరారు. తెల్లాపూర్ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించి జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో వివిధ మున్సిపాలిటీల ప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
