- రూ.43 కోట్లకు అదనంగా మరో రూ.21 కోట్లు గల్లంతు
- కోఆపరేటివ్ బ్యాంక్కు రూ.53 కోట్లు ట్రాన్స్ఫర్
- యూబీఐ మేనేజర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సీసీఎస్ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల స్కామ్ రూ.64 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు మోసం జరిగిందని భావించిన రూ.43 కోట్లతో పాటు సంతోష్ నగర్ బ్రాంచ్ నుంచి మరో రూ.10 కోట్లు, చందానగర్ బ్రాంచ్లో రూ.11 కోట్లు దారి మళ్లినట్లు హైదరాబాద్పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ల ఫోర్జరీ సంతకాలతో మనీ విత్డ్రా చేసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్స్తో పాటు మరో నలుగురి స్టేట్మెంట్స్ గురువారం రికార్డ్ చేశారు. జూన్ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగిన లావాదేవీల వివరాలు కలెక్ట్ చేశారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకు డిపాజిట్ చేసిన ఎఫ్డీల వివరాలు సేకరించారు. ఇందులో ఫిబ్రవరి రూ.43 కోట్లు, ఆగస్టులో రూ.10 కోట్లు సిద్ది అంబర్బజార్లోని అగ్రసేన్ బ్యాంక్కు ట్రాన్స్ఫర్అయినట్లు గుర్తించారు.
అధిక వడ్డీ కోసమేనా..
పోలీసులు యూబీఐ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కోపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి అధిక వడ్డీ కోసం ఎఫ్డీలను దారి మళ్లించినట్లు గుర్తించారు. ఉమ్మడి అకాడమీ ఎఫ్డీల డాక్యుమెంట్స్నూ పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే అకాడమీకి చెందిన 34 బ్రాంచ్ల్లో ఎఫ్డీ అకౌంట్స్ను గుర్తించారు. ప్రధానంగా సంతోష్నగర్, కార్వాన్, చందానగర్ యూబీఐ బ్రాంచ్ల నుంచి స్కామ్ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. మరో రెండు రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
త్రిసభ్య కమిటీ విచారణ వేగవంతం
ఎఫ్ డీల గోల్మాల్పై సర్కారు నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. గురువారం తెలుగు అకాడమీతో పాటు కార్వాన్ యూనియన్ బ్యాంక్కు వెళ్లి సిబ్బంది నుంచి కమిటీ సభ్యులు ఉమర్ జలీల్, రాంబాబు, యాదగిరి వివరాలు సేకరించారు. అకాడమీలో ఉన్న ఎఫ్డీ అకౌంట్లు, డిపాజిట్ల టైం, విత్ డ్రాల్స్వివరాలను కలెక్ట్ చేసింది. బ్యాంక్ అధికారుల నుంచి అధికారిక స్టేట్మెంట్ఇవ్వాలని కమిటీ ప్రతినిధులు కోరగా.. శుక్రవారం ఇస్తామని బ్యాంక్ సిబ్బంది చెప్పినట్లు సమాచారం. సర్కారుకు శనివారం రిపోర్టు అందించాల్సి ఉంది. కానీ ప్రైమరీ రిపోర్టును శనివారం అందించి, పూర్తిస్థాయి నివేదిక కోసం మరో మూడు, నాలుగు రోజుల టైమ్ తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అకాడమీ నిధుల గల్లంతుపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, ఎస్ఎఫ్ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జావిద్ డిమాండ్ చేశారు.