
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తుంటే భక్తుల దర్శనాలపై తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ నిర్ణయం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే తమిళనాడులో 743 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ముగ్గురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,191కి చేరింది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటివరకూ 87 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,219. మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో బుధవారం 83 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న 987 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది. తమిళనాడులో ఇప్పటివరకూ 5,882 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
మరోవైపు కరోనా నుంచి ప్రజల్ని కాపాడాల్సిన తమిళనాడు సీఎం పళని స్వామి భక్తుల దైవ దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎండో మెంట్ పరిధిలో ఉన్న 40,000 ఆలయాల్ని జూన్ 1 నుంచి పున: ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పళని స్వామి అధికారుల్ని ఆదేశించారు.