
- సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో అవినీతి
- బీఆర్ఎస్ నేతలు సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ ఆరోపణ
హైదరాబాద్, వెలుగు : సన్న బియ్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో వీరు మీడియాతో మాట్లాడారు. 2.2 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోళ్లకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలిచిందని, ఈ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
ఒక కంపెనీ రూ.57కు కిలో బియ్యం ఇస్తామని కొటేషన్ వేయగా, మిగిలిన 4 కంపెనీలు రూ.56.9కి కిలో బియ్యం ఇస్తామని కొటేషన్ వేశాయన్నారు. మార్కెట్లో కిలో సన్న బియ్యం రూ.42 నుంచి 45 రూపాయలకు దొరుకుతుంటే, అంతకంటే రూ.15 అధిక ధరకు కంపెనీలు కొటేషన్ వేయడం, అందులోనూ 4 కంపెనీలు ఒకే ధరను కోట్ చేయడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఇదంతా జరుగుతోందన్నారు. మొత్తం 2.2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోళ్లలో రూ.330 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. మరోవైపు, వడ్ల అమ్మకంలోనూ అవినీతి జరుగుతోందని సుదర్శన్ రెడ్డి అన్నారు