- సఫిల్గూడ కట్ట మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత
- నిందితుడిని పట్టుకొని చితకబాదిన భక్తులు.. పోలీసులకు అప్పగింత
మల్కాజిగిరి, వెలుగు: సఫిల్గూడ కట్ట మైసమ్మ దేవాలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మల, మూత్ర విసర్జన చేయడం ఉద్రిక్తతతకు దారి తీసింది. వేరే రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ పనిచేయడంతో గమనించిన స్థానికులు అతడిని నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో దేహశుద్ధి చేసి నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు. విషయం తెలిసిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు.
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఘటనపై స్పందించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కట్ట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను సహించబోమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
