ములుగు: మేడారం జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. సమ్మక్క రాక సమయంలో కరెంట్ పోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అద్దాలను భక్తులు ధ్వంసం చేశారు. మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం ముగిసింది. మేడారం గద్దెపై సమ్మక్క తల్లి కొలువుదీరింది.
చిలకల గుట్ట నుంచి మేడారానికి సమ్మక్క తరలివచ్చింది. ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది భక్తులు ఉన్న సమయంలో ఇలా కరెంట్ పోవడంతో పోలీసులు కూడా టెన్షన్ పడ్డారు. కొంతసేపటికి కరెంట్ వచ్చినా అప్పటికే భక్తులు ఆగ్రహించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అద్దాలను ధ్వంసం చేశారు.
మేడారం గద్దెలపై వన దేవతలు కొలువుదీరారు. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా.. గురువారం తల్లి సమ్మక్క రాకతో భక్తులు పులకించిపోయారు. ‘జై సమ్మక్క.. జైజై సారక్క’ అంటూ తల్లులను తలుచుకున్నారు. చిలుకలగుట్ట నుంచి దిగివచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయజయధ్వానాలతో స్వాగతం పలికారు. తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గాల్లోకి కాల్పులు జరపగా.. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగురవేసి, యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు.
సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్ధబోయిన మునీందర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాలతో జెండా గుట్టకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు (కంకవనం)ను తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా గద్దెలకు చేర్చారు. సమ్మక్క, సారలమ్మల గద్దెలపై పసుపు, కుంకుమ, చీరెసారెలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవిందరాజు, పగిడిద్దరాజులకు పట్టువస్త్రాలు సమర్పించారు.
