ఛాన్స్​ దక్కెది ఎవరికో?..హస్తినకు చేరిన కాంగ్రెస్ షార్ట్​ లిస్ట్​​

ఛాన్స్​ దక్కెది ఎవరికో?..హస్తినకు చేరిన కాంగ్రెస్ షార్ట్​ లిస్ట్​​
  •     టికెట్​ కోసం ఆశావహుల పైరవీలు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కాంగ్రెస్​ లీడర్లకు అసెంబ్లీ టికెట్ల టెన్షన్​పెరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రతీ నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను స్టేట్​కమిటీ ఏఐసీసీకి పంపారు. ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బడా నేతలను సంప్రదిస్తున్నారు. 

అర్బన్​లో అంతా ఉద్దండులే..

జిల్లాలో అత్యధికంగా అర్బన్ ​నుంచి 12 మంది టికెట్​ఆశిస్తున్నారు. టికెట్​కు పోటీ ఎక్కువగా ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇక్కడ బీసీ సామాజికవర్గానికి సర్దుబాటు చేసే అవకాశాలు ఉండగా, పోటీ కూడా తీవ్రంగానే ఉంది. బీఆర్ఎస్, బీజేపీకి ధీటైన అభ్యర్థిని బరిలో నిలపాలని పార్టీ భావిస్తోంది. టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​మహేశ్​గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజీ మేయర్​డి.సంజయ్ ​పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మైనార్టీ కోటా కింద ఇవ్వాల్సి వస్తే, టీపీసీపీ ఉపాధ్యక్షుడు తాహెర్​ బిన్​ హందాన్​కు టికెట్​దక్కొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పరిశీలన ఎలా ఉన్నా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న లీడర్లంతా పార్టీ పెద్దల ద్వారా టికెట్​ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆర్మూర్​లో తక్కువేమీ కాదు..

ఆర్మూర్​లో గెలుపునకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి సమర్థుడైన క్యాండిడేట్​ను బరిలో నిలపాలని అధిష్టానం యోచిస్తోంది. ఆర్మూర్​ టికెట్​కోసం పది మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.ఇటీవల పార్టీలో చేరిన వినయ్​రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్​(చిన్నా),

మహిళా కోటాలో జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరి వేముల రాధికారెడ్డి పేర్లను స్టేట్​కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా గ్రంథాలయ కమిటీ మాజీ చైర్మన్​ మార చంద్రమోహన్, జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ కూడా టికెట్​పై ఆశతో ఉన్నారు. 

రూరల్​పై భారీగా కసరత్తు..

రూరల్​ నియోజకవర్గం నుంచి ఏడుగురు పోటీపై ఆసక్తితో ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, అరికెల నర్సారెడ్డి, మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​నగేశ్​రెడ్డి పేర్లు హస్తినకు చేరినట్లు సమాచారం. 

బోధన్​ నుంచి రెండు పేర్లు..

బోధన్​ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి, కెప్టెన్​ కరుణాకర్​రెడ్డి రెండు పేర్లను స్టేట్ లీడర్లు హైకమాండ్​కు పంపారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు ఓడిన సుదర్శన్​రెడ్డి తనకే టికెట్​ వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు.

ఇప్పటికే రెండు సార్లు నియోజకవర్గంలో పోటీ చేసిన కెప్టెన్​కరుణాకర్​రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న స్టేట్​లీడర్లూ ఉన్నారు. వీరిద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

బాల్కొండ నుంచి ర్యాంకింగ్​ ఆధారంగా..

పార్టీ గతంలో నిర్వహించిన మూడు సర్వే రిపోర్టులు, కర్నాటక నుంచి వచ్చిన పార్టీ లీడర్​ అంతరంగిక నివేదిక ఆధారంగా బాల్కొండ సెగ్మెంట్ నుంచి ముగ్గురి పేర్లను హైకమాండ్​కు పంపారు. లిస్ట్​లో ఆరెంజ్​ట్రావెల్స్​ అధినేత ముత్యాల సునీల్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ​మానాల మోహన్​రెడ్డి, కిసాన్ ​కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్​రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.