తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఫ్రీ బస్సులు నడపనున్నట్లు తెలిపింది TGSRTC. గురువారం ( డిసెంబర్ 11 ) నుండి శనివారం ( డిసెంబర్ 13 ) వరకు భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లేందుకు గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ ఏరియాల నుంచి ఉచిత బస్సులు నడపనున్నట్లు తెలిపింది టీజీఎస్ఆర్టీసీ.ఈ ఉచిత బస్సులు MGBS, JBS, మియాపూర్, గచ్చిబౌలి, ఎల్.బి. నగర్, ఉప్పల్, శంషాబాద్ నుండి ఉదయం 9, 10, 11,12 గంటలకు బయలుదేరతాయని తెలిపింది.
తిరిగి ఉదయం బయలుదేరిన ప్రాంతాలకు ఫ్యూచర్ సిటీ నుంచి సాయంత్రం 4,5,6,7 గంటలకు బయలు దేరుతాయని తెలిపింది టీజీఎస్ఆర్టీసీ.నగరవాసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత బస్సులను వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. మరిన్ని వివరాలకు 959226160 నెంబరును సంప్రదించ వచ్చని తెలిపారు అధికారులు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమిట్లో ఏకంగా రూ. 5 లక్షల 75 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు సోమవారం రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. రెండో రోజు అది మరింత పెరిగింది. మంగళవారం ఒక్కరోజే రూ. 3 లక్షల 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్ రంగం సింహభాగంలో నిలిచింది. జెన్కో, రెడ్కో సంస్థలతో కుదిరిన ఒప్పందాలే దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా ఉన్నాయి.

