
‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీకాంత్... త్వరలో తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు. సూర్యతో ‘జై భీమ్’ తీసిన టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రజినీకాంత్ కెరీర్లో ఇది 170వ చిత్రం. ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ నటించినట్టుగానే.. ఇందులోనూ మూడు భాషలకు చెందిన ముగ్గురు హీరోలు నటించబోతున్నారు.
మంగళవారం వాళ్ల పేర్లను రివీల్ చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్తో పాటు టాలీవుడ్ నుంచి రానా ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం మంజువారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ పేర్లను కూడా రివీల్ చేశారు.
సోషల్ మెసేజ్ ఉండే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్లో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నటించనుండగా.. నెగటివ్ షేడ్స్ ఉండే పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నట్టు టాక్. 1991లో వచ్చిన ‘హమ్’ చిత్రంలో ఈ ఇద్దరూ కలిసి నటించారు. దాదాపు ముప్ఫై రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కలిసి నటించబోతున్నారు.