రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కరోనా రోగి అని అనుమానించిన స్థానికులు అతనిపై విచక్షణా రహితంగా దాడి చేసి, అతని చావుకు కారణమయ్యారు. ఈ దారుణ సంఘటన రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది.
థానేలోని కళ్యాణ్ పట్టణంకు చెందిన గణేష్ గుప్తా ఇంట్లో సరుకులు అవసరం పడడంతో బుధవారం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. థానే ఏరియాలో లాక్డౌన్ కట్టదిట్టంగా ఉండడంతో పోలీసులు పట్టుకుంటే ప్రశ్నల వర్షం కురిపిస్తారని భావించిన గణేష్ వారి కంట పడకుండా వేరే సందులోంచి వెళ్లాడు. అయితే కొద్దిదూరం నడిచిన తర్వాత గణేశ్ విపరీతంగా దగ్గడంతో పక్క నుంచి వెళుతున్న కొంతమంది వ్యక్తులు కరోనా ఉందోమోనని భావించారు. దీంతో ఒక్కసారిగా గణేశ్పై దాడి చేసి విపరీతంగా కొట్టారు. అయితే ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వరద కాలువలో జారిపడి గణేష్ మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖడక్పాడా స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడ్డ వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

