కొన్ని వార్తలు చదవడానికి భలేగా అనిపిస్తాయి. అసలు నిజంగా ఇలా జరిగి ఉంటుందా? అనిపిస్తాయి. ఈ వార్త కూడా అలాంటిదే. చిన్న బౌల్కు కోట్ల రూపాయలు చెల్లించి కొన్న సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. హాంకాంగ్లో జరిగిన వేలంపాటలో ఈ బౌల్ను ఒక అజ్ఞాత వ్యక్తి 248 కోట్ల రూపాయలు పెట్టి కొన్నాడు. ఇంతకీ ఆ బౌల్కు అంత ధర పెట్టి కొనడానికి కారణమేంటి అనుకుంటున్నారా? ఆ బౌల్ చైనాలోని సాంగ్ అనే రాజవంశానికి చెందినది. 13 సెంటీమీటర్ల చుట్టుకొలత ఉన్న ఆ బౌల్ నీలం, ఆకుపచ్చరంగులో ఉంది. వెయ్యి సంవత్సరాల క్రితం ఈ బౌల్ను బ్రష్లు కడగడానికి ఉపయోగించేవారట. సదబీ అనే చైనాకు చెందిన ఓ సంస్థ ఈ బౌల్ను వేలంపాట వేసింది. ఇందులో పాల్గొన్నవారంతా కోటీశ్వరులే కావడం విశేషం.
అంతేకాదు.. వేలంపాటలో పాల్గొన్నవారిలో ఎవరూ వేలంపాట జరిగే ప్లేస్కి వెళ్లలేదు. అందరూ ఫోన్లోనే వేలంపాటలో పాల్గొన్నారు. రూ. 67 కోట్ల రూపాయలతో మొదలైన వేలంపాట క్షణాల్లో వందల కోట్లకు చేరింది. అత్యంత అరుదైన ఈ బౌల్ను దక్కించుకోవడానికి చాలామంది పోటీ పడ్డారు. ఇలాంటి బౌల్లు ప్రపంచంలో నాలుగు మాత్రమే ఉన్నాయట. 2014లో మింగ్ వంశానికి చెందిన వైన్ తాగే బౌల్ను ఇలాగే వేలంపాట వేశారు. అప్పుడు ఆ బౌల్ను లియు అనే చైనా శ్రీమంతుడు రూ.235 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బౌల్ వేలంపాటలో రూ.248 కోట్ల ధర దక్కించుకోవడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.