చెస్ ఒలింపియాడ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ

చెస్ ఒలింపియాడ్ను ప్రారంభించిన ప్రధాని మోడీ

44వ ఫిడె చెస్ ఒలింపియాడ్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మెగా ఈవెంట్ మొదలైంది. అనంతరం ప్రధాని మోడీని తమిళనాడు సీఎం స్టాలిన్ సత్కరించారు. చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవంలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.  

చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం సందర్భంగా నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని బ్లాక్ అండ్ వైట్ గడులు కనిపించేలా తీర్చిదిద్దారు. భారీ చెస్ పావులను ఏర్పాటు చేశారు. టోర్నీ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

రష్యాపై వేటు..భారత్ కు ఛాన్స్

44వ చెస్ ఒలింపియాడ్ టోర్నీ రష్యాలో జరగాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర చేయడంతో  ఆ దేశంపై ఫిడె వేటు వేసింది. దీంతో  చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్ దక్కించుకుంది. ఇక ఈ టోర్నీలో  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 190 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.  ఓపెన్‌, ఉమెన్స్ విభాగంలో పోటీలు జరగనున్నాయి. రెండు విభాగాల్లో  ఆరు జట్లతో  భారత్ బరిలోకి దిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, అర్జున్‌ ఎరిగైసి వివిధ జట్లలో ఆడనున్నారు. ఇక  ద్రోణవల్లి హారిక ఎనిమిది నెలల గర్భిణి అయినా..టోర్నీలో ఆడనుండటం విశేషం. 

టోర్నీకి దూరంగా ఆనంద్..

చెస్ ఒలింపియాడ్ టోర్నీకి దిగ్గజ ఆటగాడు  విశ్వనాథన్ ఆనంద్ దూరంగా ఉన్నాడు. అతను ఈ సారి  భారత జట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు వరల్డ్ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్  నార్వే జట్టుకు ఆడుతూ.. టోర్నీకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. 

మరోవైపు చెస్ ఒలింపియాడ్ టోర్నీ నుంచి పాక్ వైదొలిగింది. టోర్నీ ఆడేందుకు పాక్ జట్లు చెన్నై చేరుకున్న తర్వాతే  దాయాది ఈ  నిర్ణయం తీసుకుంది. అయితే పాక్ నిర్ణయంపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ఇంటర్నేషనల్ ఈవెంట్ ను సైతం పాక్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.