స్మార్ట్​ఫోన్​ సేల్స్​లోనూ కనబడుతున్న రిచ్-పూర్​ తేడా

స్మార్ట్​ఫోన్​ సేల్స్​లోనూ కనబడుతున్న రిచ్-పూర్​ తేడా

కార్లలోనూ ఇదే ట్రెండ్​ పండగ సీజన్లో భారీ ఆఫర్లుండొచ్చు

వెలుగు బిజినెస్​ డెస్క్ : రేట్ల పెరుగుదల దెబ్బకి ఎఫర్డబుల్​ స్మార్ట్​ఫోన్​ సెగ్మెంట్​ తగ్గిపోతోంది. ఇన్​పుట్​ ఖర్చులు ఎక్కువవడం, విడిభాగాలు దొరక్కపోవడం వంటివీ ఇందుకు  కారణమవుతున్నాయి. మరోవైపు ప్రీమియం స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు మాత్రం దేశంలో దూసుకుపోతున్నాయి. దీనిని బట్టి మనకర్ధమయ్యేదేమంటే డబ్బున్న వారు కొత్త ప్రీమియం స్మార్ట్​ఫోన్​లు కొనడానికి ముందుకు దూకుతుంటే, డబ్బు లేని దిగువ మధ్య తరగతి వారు మాత్రం మామూలు స్మార్ట్​ఫోన్​ కొనడంలోనూ వెనకబడుతున్నారు. 

ఒక్క స్మార్ట్​ఫోన్ల విషయంలోనే కాదు, ఈ ట్రెండ్​ ఇతర హై వాల్యూ కేటగిరీలు....కార్లు వంటి వాటిలోనూ రిఫ్లెక్ట్​ అవుతోంది. దేశంలోని ధనికులపై ధరల పెరుగుదల ఎఫెక్ట్​ పెద్దగా లేదనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రేట్ల పెరుగుదల మిడిల్​ క్లాస్​, పేద ప్రజలపై మాత్రం తన ఎఫెక్ట్​ను గట్టిగానే చూపిస్తోంది. ఎందుకంటే, వీరు తమ ఆదాయంలో ఎక్కువ భాగం మొదటగా ఫుడ్​, ఇతర నిత్యావసరాలపైనే వెచ్చిస్తారు.   హై ఎండ్​ ప్రొడక్ట్స్​ అమ్మకాలకు ఏ ఇబ్బందీ లేకుండా ఉంటే,  ఎంట్రీ లెవెల్లో మాత్రం అమ్మకాలు పడిపోతున్నాయని ఐడీసీ ఇండియా డివైసెస్​ రీసెర్చ్​ అసోసియేట్​ వైస్​ ప్రెసిడెంట్​ నవ్​కేందర్​ సింగ్ పేర్కొన్నారు. డబ్బున్న వారు మరింత డబ్బున్న వాళ్లుగా ఓవైపు మారుతుంటే, పేదలు మరింత పేదలు అవుతున్నారు.

హై ఎండ్​ ఫోన్ల సేల్స్​ జూమ్​.....
ఉదాహరణకు కార్ల సెగ్మెంట్​ తీసుకుందాం. అధిక  రేటున్న కార్ల అమ్మకాల గ్రోత్​ తక్కువ రేట్ల కార్ల సేల్స్​ కంటే ఎక్కువగా రికార్డవుతోంది. రూ.10 లక్షలకి మించిన రేట్ల కార్ల అమ్మకాలు ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో 38 శాతం పెరిగితే, చిన్న కార్ల అమ్మకాలు మాత్రం 7 శాతమే పెరిగాయని క్రిసిల్​ రిపోర్టు వెల్లడిస్తోంది. ఇదే తరహాలో ప్రీమియం స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు కూడా సాగుతున్నాయి. రూ. 40 వేలకి మించిన స్మార్ట్​ఫోన్ల సేల్స్​ జూన్​ క్వార్టర్లో 83 శాతం పెరిగాయి. రూ. 8 వేల లోపు స్మార్ట్​ఫోన్లు (ఎంట్రీ లెవెల్​) సేల్స్​ మాత్రం ఇదే కాలంలో 5 శాతం పడిపోయినట్లు ఐడీసీ చెబుతోంది. అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో ఈ సేల్స్​ 17 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.  మార్కెట్​ సైజే తగ్గుతోందనుకుంటే, అన్ని సెగ్మెంట్లలోనూ అది కనబడాలి. కానీ, ఇప్పుడు మనకి కనబడుతున్నది అసాధారణమైన ట్రెండ్​ అని   సింగ్​ చెప్పారు. రేట్ల పెరుగుదల వల్ల స్మార్ట్​ఫోన్ల మార్కెట్​ అంతకు ముందు క్వార్టర్​తో పోలిస్తే జూన్​ క్వార్టర్లో 5 శాతం తగ్గిందన్నారు. ఎంట్రీ లెవెల్​ ఫోన్ల సెగ్మెంట్లో (రూ.10 వేల లోపు) డిమాండ్​ నాలుగో వంతుకు పడిపోయింది. ఎఫ్​ఎంసీజీ, ఎలక్ట్రానిక్​ గూడ్స్​ అంతకు ముందుతో పోలిస్తే ఖరీదవుతున్నాయి.  ఫ్యూయెల్​ రేట్లు బాగా ఎక్కువగా ఉండటంతో జీవన వ్యయం చాలా మందికి పెరిగింది. ఎఫర్డబుల్​ మొబైల్​ విభాగంలో అమ్మకాలు 25 శాతం తగ్గిపోవడంతో, కంపెనీల దగ్గర స్టాక్స్​ పేరుకుపోతున్నాయని మైక్రోమాక్స్​ కో ఫౌండర్​ వికాస్​ జైన్​ చెప్పారు. 

ఆఫర్లతో ముంచెత్తుతాయా...
స్టాక్స్​ నిల్వలు పెరిగిపోతే కొత్త మోడల్స్​కి దారి ఇచ్చేలా పాతవాటిపై డిస్కౌంట్​ ఆఫర్లను గుమ్మరిస్తాయి కంపెనీలు. సాధారణంగా ఫెస్టివల్​ సీజన్​లోనే ఈ ట్రెండ్​ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఆగస్టు తర్వాత మన దేశంలో ఫెస్టివల్​ సీజన్​ మొదలవుతుంది. గతంలో కంటే ఎక్కువగా ఈసారి ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ డిస్కౌంట్​ ఆఫర్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ స్టాక్స్​ను అమ్ముకోవాలంటే భారీ ఆఫర్లు ఇవ్వక తప్పదని వికాస్​ జైన్​ చెబుతున్నారు.

ఎంట్రీ లెవెల్​ విభాగంలో సప్లయ్​ సమస్యలు ఉన్నాయి. అంతేకాదు, రేట్లు పెరగడంతో  కన్జూమర్ డిమాండ్​ కూడా తగ్గిపోయింది. ఇన్​పుట్​ ఖర్చులు పెరగడంతో ఆ భారాన్ని కన్జూమర్లపైనే మాన్యుఫాక్చరింగ్​ కంపెనీలు మోపుతున్నాయి. 

- ప్రచీర్​ సింగ్​, సీనియర్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​, కౌంటర్​ పాయింట్​ రీసెర్చ్​​