నాంపల్లి పోలీస్ స్టేషన్ లో సీపీఐ నాయకుల ఆందోళన కొనసాగుతోంది. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన సీపీఐ నాయకులను మార్గమధ్యలో అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. అక్కడ కూడా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునమనేని సాంబశివరావు తో పాటు. అజీజ్ పాషా , చాడ వెంకటరెడ్డి , పలువురు నాయకులు ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసుల అక్రమ అరెస్టు లను నిరసిస్తూ స్టేషన్ లోనే ఆందోళన కు దిగారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
రాజ్ భవన్ ముట్టడికి సీపీఐ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక.. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీఐ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని సీసీఐ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలో బిల్లులను ఎంత కాలం నిలుపుదల చేయాలో.. గడువు లేకపోవడంతో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాతంత్ర శక్తులపైనే ఉన్నదని, ముఖ్యంగా కమ్యూనిస్టులపైనే ఉన్నదని సీసీఐ నేతలు చెబుతున్నారు.