50 ఏండ్ల తర్వాత మూన్​పైకి అమెరికా రాకెట్

 50 ఏండ్ల తర్వాత మూన్​పైకి అమెరికా రాకెట్
  • చంద్రుడిపైకి ఆర్టెమిస్​ 1
  • సక్సెస్​ఫుల్​గా ప్రయోగించిన నాసా
  • 50 ఏండ్ల తర్వాత మూన్​పైకి అమెరికా రాకెట్
  • ఓరియన్​ క్యాప్సుల్​ను తీసుకెళ్లిన ఎస్ఎల్ఎస్

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది. అపోలో ప్రాజెక్టు తర్వాత 50 ఏండ్లకు మళ్లీ చంద్రునిపైకి రాకెట్​ను పంపింది. మెగా మూన్ రాకెట్ ఆర్టెమిస్ 1.. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం తెల్లవారుజామున నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మూడు టెస్ట్ డమ్మీలను మోసుకెళ్లింది. చంద్రునిపైకి మళ్లీ ఆస్ట్రోనాట్​లను పంపడానికిగానూ అమెరికా ఈ ప్రయోగం చేపట్టింది. ఇది 3 వారాలు కొనసాగనుంది. చంద్రునికి సమీపంలోని కక్ష్యలో ఖాళీ క్రూ క్యాప్సుల్​ను రాకెట్​ విడిచిపెట్టనుంది. డిసెంబర్​లో ఈ క్యాప్సుల్ పసిఫిక్​ మహాసముద్రంలో పడుతుంది. దీనికి నాసా ఆర్టెమిస్ లూనార్ ఎక్స్ ప్లోరేషన్​ ప్రోగ్రాంగా పేరు పెట్టింది. 

ప్రాజెక్ట్​ అపోలోకు సీక్వెల్

1969 నుంచి 1972 మధ్య నాసా చేపట్టిన ప్రాజెక్ట్​ అపోలోకు ఇది సీక్వెల్. అప్పట్లో 12 మంది ఆస్ట్రోనాట్స్ చంద్రునిపై నడిచారు. ప్రస్తుత ప్రయోగం ఒక ట్రయల్​ రన్. దీని ఆధారంగా 2024లో చంద్రునిపైకి నలుగురు అస్ట్రోనాట్స్​ను పంపాలని స్పేస్ ఏజెన్సీ భావిస్తోంది. 2025 ప్రారంభంలో మనుషులు చంద్రునిపై అడుగుపెడతారు. ఓరియన్​ క్యాప్సుల్​ లూనార్​ ఆర్బిట్​ వరకే ఆస్ట్రోనాట్స్ ను తీసుకెళుతుంది. చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్లదు. లూనార్​ ల్యాండింగ్​ కోసం ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​తో నాసా ఒప్పందం చేసుకుంది.

అత్యంత శక్తివంతమైన రాకెట్

నాసా ఇప్పటి వరకు తయారు చేసిన రాకెట్లలో అత్యంత శక్తివంతమైనది ఈ స్పేస్​ లాంచ్​ సిస్టం(ఎస్​ఎల్​ఎస్​). 322 అడుగుల ఎత్తుతో ఈ రాకెట్ ను నాసా నిర్మించింది. దీనిని స్పేస్​ షటిల్​గా లేదా భవిష్యత్​లో మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లే స్పేస్​ షిప్​గా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాటికి ఓరియన్​ చంద్రుడిని చేరుకుంటుంది. ఈ ప్రయోగాని కి నాసా 4.1 బిలియన్​ డాలర్లను ఖర్చు చేసింది. చివరగా, చంద్రునిపై ఒక బేస్​ ఏర్పాటుచేసి అక్కడి నుంచి 2040ల ప్రారంభంలో మార్స్​పైకి ఆస్ట్రోనాట్లను పంపాలనేది నాసా ప్లాన్. అయితే దీనికి అనేక అడ్డంకులు ఉన్నాయి.

ఎన్నో అడ్డంకుల తర్వాత..

ఈ మిషన్​ కోసం నాసా ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తోంది. కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. తొలుత రాకెట్​ నుంచి ఇంధనం లీక్​ అవుతున్నట్టుగా గుర్తించారు. దీంతో ప్రయోగం వాయిదా పడింది. ఆ తర్వాత ప్రతికూల వాతావరణం కారణంగా ఆగిపోయింది. ఆర్టెమిస్ 1 మూన్ మిషన్ లాంచ్ చేయడానికి ముందు కూడా కొన్ని సాంకేతిక లోపాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. లోపాలను సరిచేసి ప్రయోగాన్ని విజయవంతం చేసినట్టు నాసా ట్విట్టర్​లో ప్రకటించింది. ఈ ప్రయోగం చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. లాంచ్​ సైట్​ దగ్గరకే 15 వేల మంది వరకు వచ్చినట్టు అంచనా.