కాస్మోటిక్ సర్జరీలు ఫెయిల్.. ఇద్దరు అమెరికన్లు మృతి
మరో 200 మంది రిస్క్లో ఉన్నట్లు గుర్తింపు
వీరికి ఫంగల్ మెనింజైటిస్ సోకినట్లు అనుమానం
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డబ్ల్యూహెచ్వోకు మెక్సికో, అమెరికా విజ్ఞప్తి
వాషింగ్టన్ : పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మెక్సికో, అమెరికా అధికారులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో)ను విజ్ఞప్తి చేశారు. మెక్సికోలో కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్న వారిలో ఫంగల్ మెనింజైటిస్ వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఇప్పటివరకు ఇద్దరు అమెరికన్లు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మెక్సికోలోని మాటామోరోస్ సిటీలో ఎపిడ్యూరల్ అనస్థీషియా సర్జరీలు చేయించుకున్న తర్వాత ఆ ఇద్దరి అమెరికన్లకు ఫంగల్ మెనింజైటిస్ సోకి మృతి చెందారని తెలిపారు. వీరు శరీరంలోని కొవ్వు తొలగించేందుకు చేయించుకునే లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్నారు.
ఈ డిసీజ్తో వందలాది మంది ప్రమాదంలో పడొచ్చని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది. అమెరికాలో ఈ డిసీజ్తో బాధపడే 25 మందిని గుర్తించినట్లు సీడీసీ తెలిపింది. కాగా, జనవరి నుంచి మే 13 మధ్య మెక్సిలోని మెటామోరోస్ సిటీలోని క్లినిక్లకు వెళ్లిన 200 మందికి పైగా అమెరికన్లు కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారని పేర్కొంది. ఫంగల్ వ్యాప్తికి సంబంధించి రివర్ సైడ్ సర్జికల్ సెంటర్, క్లినికా కే3 అనే రెండు క్లినిక్లను సీడీసీ అధికారులు గుర్తించారు. వీటిని గత నెల మే 13న సీజ్ చేశామన్నారు.
ఫంగల్ లక్షణాలు కనిపించే వారు దగ్గర్లోని హెల్త్ సెంటర్కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇన్ఫెక్షన్ పాజిటివ్గా వచ్చిన వ్యక్తులకు యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఇస్తారని చెప్పారు. సర్జరీ కోసం వినియోగించే అనస్థీషియా మందులు కలుషితమయ్యాయని, అందుకే ఫంగల్ వ్యాప్తి చెందినట్లు గుర్తించామన్నారు. మెనింజైటిస్ సోకితే జ్వరం, తలనొప్పి, మెడ గట్టిపడటం, వాంతులు, మానసిక స్థితిలో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఇది అంటువ్యాధి కాదని అధికారులు తెలిపారు.