విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువ

విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువ

అసెంబ్లీకి రిపోర్టిచ్చింది కాగ్. ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. తీసుకుంటున్న అప్పులు FRBM పరిధిలో ఉన్నా.. బడ్జెటేతర అప్పులు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. 2019-20లో ప్రభుత్వం తీసుకున్న రుణంలో.. 75 శాతం 2018-19లో తీసుకున్న అప్పులు చెల్లించేందుకే సరిపోయిందని రిపోర్టులో తెలిపింది కాగ్.

2019-20 బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని తేల్చిచెప్పింది కాగ్. బడ్జెట్ పర్యవేక్షణలో సర్కారుకు నియంత్రణ లేదని స్పష్టంచేసింది. కొన్ని కేటాయింపులు అసెంబ్లీ ఆమోదం లేకుండానే ఖర్చు చేశారని.. కొన్ని శాఖల్లో మిగులు బడ్జెట్ ను తగిన సమయంలో తిరిగి చెల్లించలేదంది. వివిధ శాఖల్లో పదేపదే మిగులు బడ్జెట్ ఏర్పడినా సంబంధిత శాఖలను హెచ్చరించలేదని రిపోర్టులో తెలిపింది. బడ్జెట్ ను పుర్తిస్థాయిలో ఖర్చుచేసే శాఖలకు కేటాయింపులు పెంచలేదని.. గత కొన్నేళ్లుగా అసెంబ్లీ ఆమోదానికి మించి అధిక వ్యయం ఖర్చవుతోందని తెలిపింది కాగ్. 

గత ఐదేళ్లలో 84వేల 650కోట్ల అధిక వ్యయాన్ని అసెంబ్లీ ఇంకా క్రమబద్దీకరించలేదని తెలిపింది కాగ్. 2019-20 బడ్జెట్ కేటాయింపు లేకుండానే 2వేల 84 కోట్లు ఖర్చుచేశారని గుర్తుచేసింది. ఇది రాష్ట్ర శాసనసభ సాధికారతను తగ్గించడమేనంది కాగ్. ఎమర్జెన్సీ నిధుల నుంచి అడ్వాన్సులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని రిపోర్టులో తెలిపింది. వార్షిక పద్దుల సమర్పణలో ప్రభుత్వం జవాబుదారీతనం లేదని దుయ్యబట్టింది. కాగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదని.. ఐదేళ్లలో రెవెన్యూ మిగులు లేదని.. ద్రవ్యలోటు 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా ప్రభుత్వం సమకూర్చుకుందని తెలిపింది. 

బడ్జెట్ అవసరాలకు మించి ప్రభుత్వం రుణాలు తీసుకుందని రిపోర్టులో తెలిపింది కాగ్. ప్రతిఏటా రుణాల భారం పెరుగుతోందని స్పష్టంచేసింది. 2019-20లో తీసుకున్న రుణాల్లో 75 శాతం అప్పుల చెల్లింపులకు వినియోగించటంతో.. ఇది ఆస్తుల కల్పన మీద ప్రభావం పడిందని తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు తక్కువగా ఉందని తెలిపింది కాగ్. సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణాలు ఆలస్యం కావడంతో వ్యయం పెరిగిందని రిపోర్టిచ్చింది. ఉదయ్ పథకం కింద ప్రభుత్వం వాటా 4వేల 63 కోట్లు చెల్లించక పోవటంతో డిస్కం లు నష్టపోయాయని తెలిపింది కాగ్.