న్యూఢిల్లీ:కరెంటు బకాయిలతో సతమతమవుతున్న ఐదు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను (డిస్కమ్లు) ఆదుకోవడానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందుకోసం ఆర్డీఎస్ స్కీమును అమలు చేస్తోంది. కేంద్రానికి ఇచ్చిన హామీ ప్రకారం..ఇవి సుమారు రూ.90 వేల కోట్ల విలువైన బకాయిలను లిక్విడేట్ చేయడానికి అంగీకరించాయి. సెంట్రల్ స్కీమ్ వల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు దాదాపు రూ.45 వేల కోట్ల నష్టాల నుంచి కూడా బయటపడతాయి. కరెంటు ప్రాజెక్టులకు రావాల్సిన బకాయిల్లో దాదాపు 65శాతం మొత్తం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచే- ఉన్నది. కేంద్రం అమలు చేస్తున్న రిజల్ట్-ఓరియెంటెడ్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో పాల్గొనడానికి అంగీకరించిన అనేక ఇతర రాష్ట్రాలతో కూడా ఇదే విధమైన సాయం కోసం చర్చలు జరుగుతున్నాయి.
చార్జీలు పెంచడానికి రెడీ
డిస్కమ్ల పునరుద్ధరణ కోసం ఈ ఐదు రాష్ట్రాలు తమ క్యాబినెట్ ఆమోదించిన చర్యల వివరాలను ఇది వరకే కేంద్రానికి సమర్పించాయి. ఈ రాష్ట్రాల్లో కొన్నింటిలో దాదాపు ఆరేళ్లలో మొదటిసారిగా చార్జీలను పెంచబోతున్నాయి. పెరుగుతున్న కరెంటు డిమాండ్ వల్ల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు లోడ్ షెడ్డింగ్, పవర్ హాలిడేలను ప్రకటించాయి. ‘‘చాలా రాష్ట్రాలు తమ డిస్కమ్ల ఆర్థిక నష్టాలను కొంతవరకు లేదా పూర్తిగా ఆర్డీఎస్ఎస్ కింద లేదా రాబోయే సంవత్సరాల్లో జీఎస్డీపీలో 0.50 శాతం వరకు అదనపు అప్పును పొందే పథకం కింద భరించడానికి ఒప్పుకున్నాయి”అని సీనియర్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. 2025 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి అన్ని రాష్ట్రాలూ ప్రభుత్వ శాఖల బకాయిలను 100 శాతం లిక్విడేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని చాలా డిస్కమ్లు నగదు కొరతతో ఇబ్బందిపడుతున్నాయి. చాలా బ్యాంకుల నుంచి వీటికి అప్పులు కూడా పుట్టడం లేదు. ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు ఒప్పుకున్న డిస్కమ్లు లిక్విడేషన్ స్ట్రాటజీలకు, టైమ్లైన్లకు కట్టుబడి ఉండాలి. ఈ మైలురాళ్లను చేరుకోలేకపోతే 2023 ఫైనాన్షియల్ ఇయర్ నుండి ప్రారంభమయ్యే అదనపు లోన్లను పొందేందుకు అర్హత పోతుందని మరో ఆఫీసర్ స్పష్టం చేశారు. 2022 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు 100 శాతం డిస్కమ్ నష్టాలను భరించడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. కేంద్రం రూపొందించిన రోడ్మ్యాప్కు ఇది ఒప్పుకుంది. దీని ప్రకారం.. ఆరేళ్లలో మొదటిసారిగా కరెంటు చార్జీలను పెంచనుంది.
బిల్లులు వసూలు చేస్తం...
ఉత్తరప్రదేశ్ కరెంటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 2025 నాటికి రూ. 20,940 కోట్ల సబ్సిడీ బకాయిల్లో 40శాతం లిక్విడేట్ చేయడానికి, రూ. 10,347 కోట్ల ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లులను వసూలు చేయడానికి ఒప్పుకున్నాయి. రాజస్థాన్ డిస్ట్రిబ్యూషన్ యుటిలిటీలకు రూ. 17,459 కోట్ల సబ్సిడీ బకాయిలుండగా, మరోవైపు రూ. 1,832 కోట్లు ప్రభుత్వ శాఖల నుంచి బకాయిలు వసూలు కావల్సి ఉంది.. 2025 నాటికి 80శాతం సబ్సిడీ బకాయిలను, 2026 ఫైనాన్షియల్ ఇయర్ నాటికి 100 శాతం బకాయిలను లిక్విడేట్ చేయాలని రాష్ట్రం టార్గెట్గా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని డిస్కమ్లు రూ. 13,880 కోట్ల సబ్సిడీ బకాయిలను లిక్విడేట్ చేయడానికి ఆ రాష్ట్ర ఒప్పుకుంది. 2025 ఫైనాన్షియల్ ఇయర్నాటికి రూ. 8,307 కోట్ల బకాయిల్లో 100 శాతం లిక్విడేట్ చేయాలనేది ఆలోచన. . తెలంగాణ డిస్కమ్లకు వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రూ.14,442 కోట్లు రావాలి. డిస్కమ్ల లాస్ టేకోవర్ కోసం తెలంగాణకు ఎటువంటి ప్లాన్ లేనప్పటికీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు 2022 ఫైనాన్షియల్ ఇయర్లో 60 శాతం టేకోవర్ చేసుకోవడానికి అంగీకరించాయి. ఇది వరకే అందజేసిన ప్లాన్ ప్రకారం, 2023 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి 75శాతం నష్టాలను 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ కిందకి తీసుకుంటాయి. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 90శాతం లాసులను 2025 ఫైనాన్షియల్ ఇయర్ లో టేకోవర్ చేస్తామని కేంద్రానికి అందించిన ప్లాన్లో ఈ అయిదు రాష్ట్రాలు పేర్కొన్నాయి.