న్యూఢిల్లీ : ఓలా ఫౌండర్ భవీశ్ అగర్వాల్ ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ కృత్రిమ్ తాజాగా యూనికార్న్ లిస్టులో జాయిన్ అయ్యింది. కంపెనీ బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర 50 మిలియన్ డాలర్లు సేకరించింది. స్టార్టప్ల వాల్యుయేషన్ బిలియన్ డాలర్లు దాటితే వాటిని యూనికార్న్లుగా పిలుస్తారు.
తాజా ఫండింగ్ రౌండ్ మ్యాట్రిక్స్ పార్టనర్స్ సారథ్యంలో జరిగింది. కృత్రిమ్ దేశంలోని మొదటి ఏఐ యూనికార్న్గా నిలిచింది. ఇండియా తన సొంత ఏఐని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందని భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. కృత్రిమ్తో పూర్తి స్థాయి ఏఐ కంప్యూటింగ్ స్టాక్ను క్రియేట్ చేస్తామని చెప్పారు. తమ మొదటి ఫండింగ్ రౌండ్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యిందని అన్నారు. కృత్రిమ్ కిందటి నెలలో తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ను లాంచ్ చేసింది. అన్ని ఇండియన్ లాంగ్వేజ్ల కోసం జెనరేటివ్ ఏఐ తీసుకొస్తామని పేర్కొంది.