
ముంబై: అమెరికాతోపాటు, పశ్చిమ దేశాలలోని బ్యాంకింగ్ క్రైసిస్ ఎఫెక్ట్తో మన దేశంలో సావరిన్ గోల్డ్ బాండ్లపై మోజు పెరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చివరిదైన సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూను ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముగించింది. నవంబర్ 2015 లో సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమును తెచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా చూస్తే మొత్తం 100 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులు పెట్టారు. డెట్ ఫండ్స్కు ఇప్పటిదాకా ఇస్తున్న పన్ను రాయితీలు ఉపసంహరించడంతో, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) నుంచి సావరిన్ గోల్డ్ బాండ్స్లోకి పెట్టుబడులు మరింత ఎక్కువవుతాయని పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
తాజా ఇష్యూ సూపర్ సక్సెస్....
తాజా సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ మార్చి 6 నుంచి మార్చి 10 వరకూ అందుబాటులో ఉంది. ఈ ఇష్యూలో ఏకంగా 3.53 టన్నుల బంగారానికి సమానమైన పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెచ్చించడం విశేషం. గడచిన 22 నెలల్లో ఇదే అతి ఎక్కువ. తాజా ఇష్యూ తర్వాత ఎస్జీబీ కింద మొత్తం అవుట్స్టాండింగ్ బాండ్స్ పరిమాణం 101.57 టన్నులకు చేరింది. మరో విధంగా చెప్పాలంటే, విలువ పరంగా ఎస్జీబీలలో పెట్టుబడులు రూ. 44,937 కోట్లకు చేరాయి. అంతే కాదు, ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి ఈ పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్ గోల్డ్ ఈటీఎఫ్ స్కీములలోని ఎసెట్స్ను మించిపోయాయి. ఈ ఫిబ్రవరి చివరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్ స్కీములలో పెట్టుబడులు రూ. 21,400 కోట్లు. మే 2021 లో వచ్చిన ఎస్జీబీ ఇష్యూలో గరిష్టంగా 5.3 టన్నుల బంగారానికి సమానమైన యూనిట్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.
దీని తర్వాత తాజా మార్చి ఎస్జీబీ ఇష్యూలో 3.53 టన్నుల బంగారానికి సమానమైన యూనిట్లలో ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు. సావరిన్ గోల్డ్ బాండ్స్పై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడులు ఇక మీదట సావరిన్ గోల్డ్బాండ్స్ వైపు మళ్లే ఛాన్స్లు ఎక్కువని ప్లాన్రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఫౌండర్ అమోల్ జోషి చెప్పారు. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలలోని బ్యాంకింగ్ సమస్యల కారణంగానే తాజా ఎస్జీబీ ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారని ఎనలిస్టులు అన్నారు. మరో రెండు క్వార్టర్ల దాకా గోల్డ్ రేట్లు పై లెవెల్లోనే కొనసాగొచ్చని అంచనావేశారు.
మార్కెట్లోని ఇప్పటి వడ్డీ రేట్లు, మాక్రో ఎకనమిక్ పరిస్థితులు, గ్లోబల్గా ఉన్న రాజకీయ అనిశ్చితి వంటి వాటి వల్ల బంగారంలో పెట్టుబడులే ఆకర్షణగా నిలుస్తాయి. ఇండియాలో ఎస్జీబీలు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. పైన చెప్పుకున్న కారణాల వల్ల బంగారం రేట్లు రాబోయే ఆరు నెలల్లో పై లెవెల్లోనే నిలకడగా కొనసాగుతాయి. 2024 లో బంగారం రేట్లలో కరెక్షన్ రావొచ్చు. - శేఖర్ భండారి , ప్రెసిడెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్