న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో 2019 ఇయర్కు గుడ్ బై చెప్పి, కొత్త సంవత్సరం 2020లోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం చాలా మంది ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తుంటారు. కానీ కొన్ని ఫైనాన్సియల్ టాస్క్లను 2019 ముగియక ముందే పూర్తి చేసుకోవాల్సి ఉంది. వాటి డెడ్లైన్ కూడా మరో రెండు రోజుల్లోనే ముగుస్తోంది. అవేమిటో ఓ సారి చూద్దామా…!
ఆధార్తో పాన్ లింక్…
ఆధార్తో మీ పాన్ కార్డును లింక్ చేసుకోవడానికి ఆఖరు తేదీ 2019 డిసెంబర్ 31. అంటే ఈ నెల చివరి తర్వాత ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డులు ఇన్వాలిడ్ అయిపోతాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆధార్తో పాన్ కార్డు లింక్ తప్పనిసరి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్(ఐటీఆర్) ఫైల్ చేసేటప్పుడు ఇది తప్పనిసరి అని పేర్కొంది. ఆధార్తో పాన్ లింక్ చేసుకునే తుది గడువును ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి ఈ నెల చివరి వరకు పొడిగించారు.
ఐటీఆర్ ఫైలింగ్…
ఇప్పటి వరకు మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, బీలేటెడ్ రిటర్న్లను ఈ ఏడాది చివరి వరకు ఫైల్ చేసుకోవచ్చు. భారీ పెనాల్టీల నుంచి తప్పించుకోవాలంటే, తుది గడువు కూడా ముగిసే లోపలే ఫైల్ చేయాలి. అయితే మీ బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ను డిసెంబర్ 31న, లేదా అంతకంటే ముందు చేసినా కూడా.. రూ.5 వేల లేటు ఫైలింగ్ ఫీజు ఉంది. డిసెంబర్ 31 తర్వాత ఈ అసెస్మెంట్ ఇయర్లో మార్చి 31కి ముందు వరకు ఫైల్ చేస్తే పెనాల్టీ రూ.10 వేలు పడుతుంది.
ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను మార్చుకోవడం…
మీరు ఇప్పటి వరకు మాగ్నిటిక్ స్ట్రిప్ ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డును వాడుతున్నట్టయితే, ఆ కార్డు ఈ నెల చివరి తర్వాత నిరుపయోగంగా మారుతుంది. దాన్ని ఎస్బీఐ డియాక్టివేట్ చేస్తుంది. మీరు ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత కార్డుతో దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. ఇప్పటికే ఈ విషయాన్ని ఎస్బీఐ పలుమార్లు ట్విటర్ ద్వారా తన యూజర్లకు చెప్పింది. అన్ని మాగ్నిటిక్ స్ట్రిప్ కార్డులు ఈ నెల చివరితో డియాక్టివేట్ అవుతాయని పేర్కొంది. కొత్త ఈఎంవీ చిప్ ఆధారిత డెబిట్ కార్డు కోసం ఇప్పటికే అప్లయ్ చేసుకున్నా.. ఇంకా వారికి కార్డు రాకపోతే, ఎస్బీఐ హోమ్ బ్రాంచ్ను ఎంత వీలైతే అంత త్వరగా సంప్రదించాలని ఎస్బీఐ సూచించింది.
అడ్వాన్స్ ట్యాక్స్లు చెల్లింపు…
ఉత్తరాది రాష్ట్రాలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అడ్వాన్స్ ట్యాక్స్ల మూడో ఇన్స్టాల్మెంట్ చెల్లించే డెడ్లైన్ను సీబీడీటీ పొడిగించింది. ఈ తేదీని ఈ నెల 15 నుంచి 30 వరకు పొడిగిస్తున్నట్టు సీబీడీటీ పేర్కొంది.