- డ్రగ్స్, గంజాయి అఫెండర్ల డేటాతో యాప్
- టీఎస్ కాప్, సీసీటీఎన్ఎస్తో డోపమ్స్ కనెక్ట్
- డ్రగ్ అఫెండర్ల ప్రొఫైల్స్తో పక్కాగా ట్రేసింగ్
- రాష్ట్ర పోలీసుల యాప్ సక్సెస్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లను ట్రాక్ చేసేందుకు రాష్ట్ర పోలీసులు రూపొందించిన ‘‘డ్రగ్ అఫెండర్స్ ప్రొఫైలింగ్, అనలైసిస్ అండ్ మానిటరింగ్ సిస్టం(డోపమ్స్)” యాప్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ గతేడాది డోపమ్స్ యాప్ను రూపొందించింది. సెప్టెంబర్లో డీజీపీ మహేందర్ రెడ్డి దీనిని ప్రారంభించారు. టీఎస్ కాప్ యాప్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్)తో దీనిని కనెక్ట్ చేశారు. ఇదే యాప్తో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే స్పెషల్ టాస్క్ఫోర్స్ యాక్టివిటీ ప్రారంభించేలా ఏర్పాటు చేశారు. ఐదేండ్లుగా రాష్ట్రంలో పట్టుబడ్డ డ్రగ్స్, గాంజా సహా ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు, కస్టమర్ల వివరాలను డోపమ్స్ లో అప్లోడ్ చేశారు. ఈ యాప్ డేటాతో ఓల్డ్ అఫెండర్లను ట్రేస్ చేస్తూ, డ్రగ్స్ దందాకు సక్సెస్ ఫుల్ గా చెక్ పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా ట్రాక్ చేస్తున్రు
డోపమ్స్తో దేశవ్యాప్తంగా పోలీస్ రికార్డ్స్లో ఉన్న డ్రగ్స్, గాంజా అఫెండర్స్ మూవ్మెంట్స్ను రాష్ట్ర పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. దీనిద్వారా రెండు నెలల్లో సుమారు 15 మంది ఓల్డ్ డ్రగ్ అఫెండర్స్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల పోలీసులకు అఫెండర్ల సమాచారం చేరవేస్తున్నారు. ఇందుకోసం ఎక్సైజ్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అరెస్ట్ చేసిన నేరగాళ్ళ డేటాను యాప్లో అప్లోడ్ చేశారు. పట్టుబడ్డ నేరస్తుల ఫొటోస్, డ్రగ్స్ సప్లయ్ చేసిన విధానం కస్టమర్ల వివరాలతో పూర్తి సమాచారం ఫీడ్ చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు యాప్ లోకి డేటా
డీజీ స్థాయి అధికారి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల యూనిట్లు,746 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి యాప్ యాక్సెస్ ను ఇచ్చారు. దీంతో ప్రతి పీఎస్లో రిజిస్టరయ్యే డ్రగ్స్, గాంజా, ఎన్డీపీఎస్ కేసులు, నిందితుల వివరాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. హాట్ స్పాట్లను గుర్తించేందుకు ఏరియా డీటెయిల్స్ పోస్ట్ చేస్తున్నారు. జైలు నుంచి రిలీజైన అఫెండర్స్ను లోకల్ పోలీసులతో మానిటరింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రిపీటెడ్గా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న స్మగ్లర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇదే సమాచారం సీసీటీఎన్ఎస్ వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న14,368 లా అండ్ ఆర్డర్ పీఎస్ల డేటా డోపమ్స్తో రికార్డ్ అవుతోంది.