మెదక్/తూప్రాన్, వెలుగు : రెండు రోజుల కింద ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ కావడంతో మెదక్ జిల్లాలోని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాలుగా తమకు జీవనాధారంగా ఉన్న భూములు పోతే తాము బతికేదెట్టా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ఆర్ సమీపంలో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గతంలో పేదలకు పంచిన అసైన్మెంట్, లావణి భూములను స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది.
జిల్లాలో 316 ఎకరాలు..
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పక్క నుంచి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఇస్లాంపూర్ సమీపంలోని మాసాయిపేట స్టేషన్, తూప్రాన్ పట్టణ శివారులో ఇంటర్ చేంజ్ జంక్షన్ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో జంక్షన్, ఆర్ఆర్ఆర్కు సమీపంలో సర్వే నంబర్ 14లో ఉన్న 316 ఎకరాల లావణి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ కోసం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత మార్చి, ఏప్రిల్ లో రెవెన్యూ ఆఫీసర్లు ఆ భూములను సర్వే చేశారు. 14 సర్వే నంబర్ లో ఏ ఏ రైతుకు, ఎంత భూమి ఉందనేది గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు. ఈ క్రమంలో ల్యాండ్ పూలింగ్ కోసం ఆ భూమిని సేకరించనున్నట్టు కలెక్టర్ ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఆ సర్వే నంబర్ లో భూములు ఉన్న ఇస్లాంపూర్, పలుగుగడ్డ తండా, మాసాయిపేట గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భూములే తమకు ఆధారమని, అందులో పంటలు పండించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, అవి పోతే తాము ఆగమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఇస్లాంపూర్ గ్రామ రైతులు గత సోమవారం మెదక్ కలెక్టరేట్కు తరలివచ్చి ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.
కొనుగోలు, అమ్మకాలపై బ్యాన్
ల్యాండ్ పూలింగ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ వెలువడినందున భూసేకరణ చట్టంలోని సెక్షన్ 11(4) ప్రకారం ప్రతిపాదిత భూమి కొనుగోలు, అమ్మాకాలు, తాకట్టు పెట్టడానికి వీలులేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ కోసం ప్రతిపాదించిన భూములకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్టయితే నోటిఫికేషన్ జారీ అయిన తేదీ నుంచి 60 రోజులలోపు కలెక్టర్, భూసేకరణ అధికారికి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.
మా భూములు మాకే ఉండాలె
నాకు సర్వే నెంబర్ 14లో రెండకరాల లావాణి భూమి ఉంది. చాలా ఏండ్ల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఇప్పుడు ఆ భూమి సర్కారు తీసుకుంటదట. మా తండా రైతులకు సంబంధించి 30 ఎకరాల భూమిదాక పోతుంది. ఈ భూములు పోతే మేం ఎట్ల బతకాలె. మా భూములు మాకే ఉండాలె. పట్టా పాస్ పుస్తకాలు ఇయ్యాలె.
- తులసీరాం, రైతు, పలుగుడడ్డ తండా, ఇస్లాంపూర్