మరో ఏడు వాహనాలకూ నిప్పు
చెన్నైలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
చెన్నై: ప్రేమా, గీమా వద్దు బిడ్డా.. ఆ పిల్లను వదిలెయ్ అని తండ్రి బుజ్జగించి చెప్పిండు. అయినా వినకుండా కొడుకు ఆ పిల్లతో బైక్ మీద కన్పించేసరికి కోపంతో రగిలిపోయిండు. తను కొనిచ్చిన బైక్ను తనే తగలబెట్టిండు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. సిటీకి చెందిన కర్ణన్ ఓ ఆటో రిక్షా డ్రైవర్. కొడుకు అరుణ్ను కష్టపడి చదివించి, ఉద్యో గస్తుడిని చేసిండు. ప్రేమతో ఓ బైక్ కూడా కొనిపెట్టిండు. అయితే, కొడుకు ప్రేమను మాత్రం అంగీకరించలే. ఆ అమ్మాయిని కలవొద్దని కొడుకుకు ఆర్డరేసిండు. ఆ కొడుకూ తగ్గలే, ఏకంగా గర్ల్ఫ్రెండ్తో లివిన్ రిలేషన్ షిప్ మొదలెట్టిండు. ఒకరోజు ఆ పిల్లను వెంటేసుకుని తిరుగుతూ తండ్రి కండ్లబడ్డడు. ఇంకేముంది, కర్ణన్కు మస్తు కోపమొచ్చింది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిందేనని డిసైడ్అయిండు. ఓ మందు బాటిల్, పెట్రోల్ బాటిల్ పట్టుకుని కొడుకు ఉండే చోటుకు పోయిండు. మందునేమో గొంతులో పోసుకుని.. పెట్రోల్ను బైక్ పై పోసి నిప్పంటించిండు. ఇదంతా యాక్సిడెంట్లా కన్పించాలని పక్కనే పార్క్ చేసిన మరో ఏడు బైకులనూ తగలెట్టిండు. తర్వాత బాటిల్ అక్కడే పారేసి పరారైండు. బైక్లు తగలబడడం, పక్కనే పెట్రోల్ బాటిల్ ఉండడంతో ఆ బైక్ల ఓనర్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొడుకు ప్రియురాలు మాత్రం కర్ణన్పై అనుమానం వ్యక్తం చేసింది. తన కొడుకును వదిలేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతకాలంగా కర్ణన్ బెదిరిస్తున్నాడని, ఈ పని అతడే చేసి ఉండొచ్చని చెప్పింది. దీంతో పరారీలో ఉన్న కర్ణన్ను రెండు నెలల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బైక్లను తగలబెట్టింది తనేనని ఒప్పుకున్నడు. పోలీసులు కేసు నమోదు చేసి, కర్ణన్ ను రిమాండ్కు పంపించారు.