భద్రాచలంలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలంలో మళ్లీ మూడో ప్రమాద హెచ్చరిక

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మరోసారి వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఇవాళ ఉదయం 54.50 అడుగులకు నీటి ప్రవాహం చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 15 లక్షల 2 వేల 258 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 

గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో... భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై నెల్లిపాక దగ్గర నీరుచేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. 

ఛత్తీస్ గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో చింతూరు దగ్గర శబరి నది ప్రవాహం పెరుగుతోంది. అటు పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల నుంచి వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ దగ్గర నీటి మట్టం 13 అడుగులు దాటింది. అయితే ఇవాళ వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు కృష్ణానదికి వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు 3 లక్షల 35 వేల 635 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం డ్యాం 10 గేట్లు ఎత్తి దిగువన సాగర్ కు 3 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

బంగాళాఖాతంలో అల్పపీడనం కోనసాగుతోంది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.