
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు ఆయువు పట్టులాంటి రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీస్తున్నదని తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టీజీటీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ఆరోపించారు. వీఆర్వోలను రెవెన్యూ శాఖ నుంచి తొలగిస్తూ జారీ చేసిన జీవో నం.121ను వెంటనే రద్దు చేయాలని, నిండు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని సీఎం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో జీవోను రద్దు చేయకపోతే ధరణిలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతామని హెచ్చరించారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు, వీఆర్ ఏల సమస్యల మీద పలు రెవెన్యూ సంఘాలతో కలిసి సోమవారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో వి.లచ్చిరెడ్డి, వీఆర్వోల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, అడిషనల్ సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేశ్ మీడియాతో మాట్లాడారు.
లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఎంతో కీలకమైన రెవెన్యూ శాఖకు సీసీఎల్ఏ కమిషనర్ , రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, చివరకు రెవెన్యూ మంత్రి లేకుండా శాఖను మొత్తం నిర్వీర్యం చేసి అనాథగా మార్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్ను తెచ్చిన తర్వాత తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ ఇలా ఎవరికీ అధికారాలు లేవని చెప్పారు. దీంతో ప్రజలకు, రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదన్నారు. ‘‘నువ్వు ఏం చేయగలవ్.. మహా అయితే ఏసీబీ, ఇతర సంస్థలతో దాడులు చేయించగలవు. ఉద్యోగస్తులను ఉద్యోగం నుంచి తీసేయగలవా? నీకు అంత దమ్ముందా?’’ అని సీఎం కేసీఆర్ కు లచ్చిరెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ లో స్టేషన్ లో ఉండేది తామేనని, ఏం చేయాలో తమకు తెలుసని హెచ్చరించారు. అన్యాయాన్ని ప్రతి పోలింగ్ స్టేషన్లో చెప్తామని, ధరణిలో జరుగుతున్న అక్రమాలను బయటపెడతామని స్పష్టం చేశారు. తాను వీఆర్ఎస్కు అప్లై చేసుకుంటే ఇప్పటి వరకు ఆమోదించలేదని తెలిపారు. 15 రోజుల్లో 121 జీవో వెనక్కి తీసుకోకపోతే రెవెన్యూలో నిరవధిక సమ్మె చేపడతామని ఆయన హెచ్చరించారు.
న్యాయం జరిగే వరకు పోరాడుతం: గోల్కొండ సతీశ్
భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పి వీఆర్వోల అవసరం లేదంటున్నారని, తాము ఇవేగాక మరో 54 రకాల విధులను నిర్వర్తిస్తున్నామని వీఆర్వో సంఘాల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్ తెలిపారు. మిగతా 53 రకాల విధులను ఎవరితో చేయిస్తారని ఆయన ప్రశ్నించారు. తమకు ఏ మాత్రం అన్యాయం జరిగినా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, వీఆర్వోలెవరూ ఆర్డర్ కాపీలను తీసుకోబోరని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
రెవెన్యూలో కేడర్ స్ట్రెంత్ నిర్ధారించండి: ట్రెసా
వీఆర్వోలను ఇతర శాఖల్లోకి పంపడంతో రెవెన్యూ శాఖ 6,874 పోస్టులను కోల్పోతుందని, --రెవెన్యూ శాఖలోని ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అర్హత గల వీఆర్వోలతో నింపాలని తెలంగా ణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) డిమాండ్ చేసింది. వీఆర్వోలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయాలనే తమ విజ్ఞప్తిని విస్మరించిందని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతం కుమార్
మండిపడ్డారు.