మెటీరియల్​కాంపోనెంట్ బిల్లులు రూ. కోట్లలో పెండింగ్​

మెటీరియల్​కాంపోనెంట్ బిల్లులు రూ. కోట్లలో పెండింగ్​

 

  •  లేబర్​ పర్సంటేజీ పెంచితేనే కేంద్రం నుంచి నిధులు
  •     మెటీరియల్​కాంపోనెంట్ బిల్లులు రూ. కోట్లలో పెండింగ్​
  •     ఎక్కువమంది కూలీలతో పనులు చేయించాలని ఆఫీసర్లపై ఒత్తిడి 
  •     ఒక్కో గ్రామంలో 300 మంది కూలీల టార్గెట్​

నల్గొండ, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల బిల్లులు చెల్లించేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. గతేడాది గ్రామాల్లో చేపట్టిన శ్మశానవాటికలు, రైతు వేదికలు, చెత్త డంపింగ్​యార్డులు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలతోపాటు, ఇతర మెటీరియల్​కాంపోనెంట్​పనులకు సంబంధించిన బిల్లులు కోట్ల రూపాయలు పెండింగ్​లో ఉన్నాయి. ఈ పనులు చేసిన సర్పంచులు, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ రాష్ట్ర సర్కార్​వద్ద ఫండ్స్​లేకపోవడంతో ఏడాది కాలంగా పేమెంట్స్​ఆగిపోయాయి. ఈ బిల్లులు పేమెంట్​చేయాలంటే గ్రామాల్లో  లేబర్​ వర్క్స్​ జరిగితే తప్ప సాధ్యం కాదని తేలిపోయింది. దీనికోసం ప్రస్తుతం సర్కారు​ఉపాధి కూలీలను పోగేసే పనిలో పడింది. సాధారణంగా వేసవిలో ఉపాధి పనులకు డిమాండ్​ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్​లో ఎంత ఎక్కువ పనులు జరిగితే పర్సంటేజీ ప్రకారం మెటీరియల్ ​ కాంపోనెంట్ అంతకంతకు పెరుగుతుంది.  దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెలలో ప్రతి గ్రామంలో 300 మంది కూలీలను ఉపాధి పనులకు తరలించాలని ఆఫీసర్లకు టార్గెట్ ​పెట్టింది.  కానీ ఓవైపు ఎండలు మండిపోతుండటం, పనులు జరిగే ప్రదేశాల్లో కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో కూలీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు నెల రోజుల నుంచి లేబర్​కు చెల్లించాల్సిన వేజ్ పేమెంట్స్​కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో సర్కారు​పెట్టిన టార్గెట్​ఎలా పూర్తిచేయాలో అర్థంగాక ఫీల్డ్​ స్టాఫ్​ సతమతమవుతున్నారు. 
కూలి గిట్టుబాటు కావట్లే..
ఈ సీజన్​లో జరుగుతున్న ఉపాధి పనులు కూలీలకు గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఇవ్వాల్సిన సమ్మర్​ అలవెన్స్​గత మూడు నెలల నుంచి ఇయ్యట్లే. ఇది చాలదన్నట్టుగా ప్రస్తుతం కూలీలకు సగటున రూ.120కు మించి కూలి గిట్టుబాటు కావడం లేదు. గతంలో సమ్మర్​అలవెన్స్​తో కలిపి రోజువారీ వేతనం కనీసం రెండొందల వరకు వచ్చేది. కానీ మారిన కొత్త సాఫ్ట్​వేర్​లో కూలీలకు సమ్మర్​అలవెన్స్​ రావడం లేదని ఆఫీసర్లు చెబుతున్నారు. తాజా లెక్కల ప్రకారం ఒక్కో గ్రామంలో సగటున రోజుకు 50 నుంచి 100 మంది కూలీలు మాత్రమే పనులకు వస్తున్నారు. దీన్ని రెండింతలు పెంచడం అంటే కష్టమేనని ఉపాధి స్టాఫ్​ అంటున్నారు. కూలీల్లో ఎక్కువభాగం వృద్ధులు, మహిళలు ఉంటున్నారు. కూలీ గిట్టుబాటు కావడం లేదన్న ఉద్దేశంతో మగవాళ్లు ఉపాధి పనుల వైపు మొగ్గుచూపడం లేదు. గడిచిన రెండు నెలల నుంచి ఉపాధి డబ్బులు సక్రమంగా పేమెంట్​ చేయడం లేదు. కొత్త సాఫ్ట్​వేర్​లో తరచూ ఇబ్బందులు తలెత్తుతుండడంతో పేమెంట్స్​ఆలస్యమవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం మార్చి వరకు కూలీల డబ్బులు క్లియర్ ​చేశారు. ఇంకా ఏప్రిల్​నెల వేజ్​ పేమెంట్స్​ పెండింగ్​ ఉన్నాయి. ప్రతివారం జనరేట్ కావాల్సిన పేమెంట్స్​టెక్నికల్​ ప్రాబ్లమ్స్​వల్ల నెలల తరబడి ఆగాల్సి వస్తోందని ఉపాధి స్టాఫ్​ చెబుతున్నారు. ఈ సమస్యల్ని పట్టించుకోకుండా గతేడాది లెక్కల ప్రకారం ఈ సీజన్​లో లేబర్​ పర్సంటేజీ పెంచాలని టార్గెట్​పెట్టడం కరెక్ట్​ కాదని వాపోతున్నారు. కిందటేడు కరోనా వల్ల ఉపాధి పనులకు డిమాండ్​ పెరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఈ సీజన్​లో పరిస్థితులు అనుకూలంగా లేవని ఫీల్డ్​ స్టాఫ్​ చెబుతున్నారు.