పాలమూరుకు పైసలేవి?

పాలమూరుకు పైసలేవి?
  • 18 ప్యాకేజీల్లో అంతగా సాగని పనులు
  •  బకాయిలు చెల్లించకపోవడమే కారణం!
  •  బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
  •  పవర్‌‌ ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ అప్పు వస్తేనే  చెల్లింపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుపాలమూరు–రంగారెడ్డి ఇరిగేషన్​ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. బిల్లుల పెండింగ్​ వల్ల పనులు స్లోగా నడుస్తున్నాయి.  చాలా రోజుల నుంచి బకాయిలు చెల్లించడం లేదని ప్రాజెక్టు వర్క్‌‌ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాజెక్టును రూ. 32,500 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్‌‌ సాంక్షన్‌‌ ఇవ్వగా.. ఇప్పటివరకు  భూసేకరణ, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ కలిపి రూ. 6,874 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ. 5 వేల కోట్ల విలువైన ఎర్త్‌‌, కాంక్రీట్‌‌ పనులు కూడా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఎర్త్​, కాంక్రీట్​ పనులకు సంబంధించి రూ. 1,700 కోట్ల బిల్లులు వర్క్‌‌ ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులను చెల్లించాలంటూ చాలా రోజుల నుంచి ఇంజనీర్లపై  కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. బిల్లులు రాకపోతే పనులు ఎలా ముందుకు సాగుతాయని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనైతే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. పెండింగ్‌‌ బిల్లులు చెల్లించకపోవడంతో 18 ప్యాకేజీల్లో అంతగా పనులు సాగడం లేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా సాగుతున్నాయి.

ఆ నిధులు వస్తేనే..

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ రూ. 10 వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇచ్చింది. కాళేశ్వరం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఈ మేరకు పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌తో అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియకు మరింత సమయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అగ్రిమెంట్‌‌‌‌‌‌‌‌ పూర్తయి హెడ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ది ఎకౌంట్‌‌‌‌‌‌‌‌లో డబ్బు జమ అయితే తప్ప ప్రాజెక్టు పనులకు నిధులు రావు. ఈ ప్రక్రియ కనీసం 15 నుంచి 20 రోజులకు పైగానే తీసుకునే అవకాశముందని సమాచారం. డబ్బు వస్తే పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లుల్లో కొంతమేరకు చెల్లించి మిగతా పనులు చేయించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. పవర్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే రూ.10 వేల కోట్ల అప్పుకు సమానంగా రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం స్వయంగా మాట ఇచ్చారు. అయితే థర్డ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఈ మేరకు నిధులు విడుదలయ్యేది అనుమానమేనని అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్త్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కొంత మేరకు డబ్బు రావొచ్చని నమ్మకంగా చెప్తున్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌ బిల్లులు, కాస్ట్‌‌‌‌‌‌‌‌ ఎస్కలేషన్‌‌‌‌‌‌‌‌, ఇతరత్రా ఖర్చులు లెక్కిస్తే రూ. 2 వేల కోట్లు పోను అప్పుగా తెచ్చే రూ. 8 వేల కోట్లతోనే మొదట పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు, రిజర్వాయర్లు, టన్నెళ్లు, కాలువలు తవ్వాల్సి ఉంటుంది. సీఎం చెప్పినట్టుగా రూ.10 వేల కోట్లు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కేటాయించడంతో పాటు ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆమేరకు నిధులు విడుదల చేస్తే టార్గెట్‌‌‌‌‌‌‌‌ మేరకు వచ్చే జూన్‌‌‌‌‌‌‌‌ నాటికి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి పనులు చేయగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు.

నార్లాపూర్‌‌‌‌‌‌‌‌పై స్పష్టత కరువు

ప్రాజెక్టులో ప్రధాన రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నార్లాపూర్‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి స్థానికంగా మట్టి కొరత ఉండటంతో తెహ్రీ డ్యాం తరహాలో రాక్‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని నిర్ణయించారు. ఇంజనీర్లు ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌లోని తెహ్రీ డ్యాంను సందర్శించి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సహకారం అందించాలని తెహ్రీ హైడ్రో పవర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ అధికారులను కోరారు. ఈమేరకు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఈడీ రాజీవ్‌‌‌‌‌‌‌‌ వైష్ణో, ఇంజనీర్ల బృందం నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి రూ. 1,182 కోట్లతో రాక్‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌ డ్యాం నిర్మాణానికి ప్రాథమిక అంచనా రూపొందించారు. వారి నుంచి పూర్తిస్థాయి ఎస్టిమేషన్స్‌‌‌‌‌‌‌‌ రావాల్సి ఉంది. ఇటీవల ప్రాజెక్టు పనులపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్​ నార్లాపూర్‌‌‌‌‌‌‌‌ ఎస్టిమేషన్‌‌‌‌‌‌‌‌ త్వరగా తెప్పించాలని సూచించారు. శుక్రవారం నాటి రివ్యూలోనూ రాక్‌‌‌‌‌‌‌‌ఫిల్‌‌‌‌‌‌‌‌ డ్యాంపై మరోసారి అధ్యయనం చేయాలని సూచించినట్టు తెలిసింది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి 2 కోట్ల 26 లక్షల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టి అవసరం ఉండగా, ఇక్కడ 60 లక్షల క్యూబిక్‌‌‌‌‌‌‌‌ మీటర్ల మట్టి మాత్రమే అందుబాటులో ఉంది. నార్లాపూర్‌‌‌‌‌‌‌‌లో 30 శాతం పనులు చేయగా దాదాపు అందుబాటులో ఉన్న మట్టిని ఉపయోగించారు. ఈ బ్యారేజీపై ఎలా ముందుకు వెళ్లాలని ఇంజనీర్లు సమావేశమై చర్చించారు. సోమవారం నాటికి నార్లాపూర్‌‌‌‌‌‌‌‌పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటరీ కాలువల సంగతి?

పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల నీటితో వచ్చే వానాకాలంలో 7 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టారు. మూడేండ్లుగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 40 శాతమే పూర్తి కాగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల్లో ఎంతమేరకు పనిచేయగలమనే లెక్కల్లో అధికారులు ఉన్నారు. రిజర్వాయర్ల నుంచి పంట పొలాలకు నీటిని అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకానికి ఇప్పుడే సర్వే చేస్తున్నారు. ప్రతి డిస్ట్రిబ్యూటరీలో వందలాది మంది రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంటుంది. భూములు ఇవ్వడానికి రైతులు అంత ఈజీగా ఒప్పుకోరు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌కు ఒక చోట భూసేకరణ చేస్తే సరిపోతుందని, కాలువల తవ్వకానికి కిలోమీటర్ల కొద్ది భూని సేకరించాల్సి ఉంటుందని ఒక ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. ఈక్రమంలో రైతులను ఒప్పించడం తమ ముందు ఉన్న పెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌ అని చెప్తున్నారు. వచ్చే వానాకాలానికి రిజర్వాయర్లు, పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు, టన్నెళ్లు, ప్రధాన కాల్వలు పూర్తయినా డిస్ట్రిబ్యూటరీల తవ్వకానికి మరికొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే టార్గెట్‌‌‌‌‌‌‌‌ రీచ్‌‌‌‌‌‌‌‌ అవుతుందని, నీళ్లు ఎత్తిపోసి రిజర్వాయర్లు నింపితే ఎలాంటి ప్రయోజనం ఉండదని మరో అధికారి తెలిపారు.