- అమ్మేసి...ఆనక మొహం చాటేస్తున్న కంపెనీలు
- అవస్థలపాలవుతున్న కన్జూమర్లు
వెలుగు బిజినెస్ డెస్క్: ఎంతో ఇష్టపడి కొనుక్కుంటున్న ఖరీదైన వస్తువులు సరిగా పనిచేయకపోతే...చాలా కష్టంగా అనిపిస్తుంది కదూ! మన దేశంలో ఇలా ఖరీదైన వస్తువులు కొనుక్కుని అవి సరిగా పనిచేయనప్పుడు ఇబ్బందులెదుర్కొంటున్న కస్టమర్ల సంఖ్యకు కొదవేలేదని ఒక సర్వేలో తేలింది. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో ఖరీదైన వస్తువులు కొనడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అనుభవాలపై లోకల్ సర్కిల్స్ ఒక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఖరీదైన వస్తువులు కొన్నాక వాటిలో ఏవైనా లోపాలుంటే కస్టమర్లకు సరయిన పరిష్కారం దొరకడం లేదని ఈ సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఇలాంటి ప్రోబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే పరిస్థితి ఈజీగానే అర్థమవుతుంది. కన్జూమర్ల అనుభవాలు తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది. కొన్న ఖరీదైన ప్రొడక్టులలో లోపాలుంటే, రీప్లేస్మెంట్ కోసం కన్జూమర్లు చాలా అవస్థలు పడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. దేశంలోని 355 చోట్ల నుంచి 28 వేల మంది కన్జూమర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో 63 శాతం మంది మగవారని, 37 శాతం మంది మహిళలనీ లోకల్ సర్కిల్స్ తెలిపింది. తాము కొన్న హై వాల్యూ ఐటమ్స్లో కనీసం ఒక్కటైనా డిఫెక్టివ్ వస్తువు ఉందని 46 శాతం మంది సర్వేలో చెప్పారు. ఫాల్టీ లేదా డిఫెక్టివ్ ప్రొడక్ట్ కొన్న తర్వాత ఆయా బ్రాండ్ల నుంచి ఎలాంటి సపోర్టూ లభించలేదని ప్రతి పది మందిలో ముగ్గురు వెల్లడించారు. అయితే ప్రోబ్లమ్ సొల్యూషన్ కోసం అసలు ఆ బ్రాండ్నే కోరలేదని పది మందిలో ఒకరు చెప్పారు. కొన్న ఖరీదైన వస్తువులలో ఒక్కటైనా డిఫెక్టివ్ ఉందని ప్రతీ ఇద్దరు కన్జూమర్లలో ఒకరు పేర్కొన్నారు.
ఆఫ్టర్ సేల్స్ సర్వీసు, రీప్లేస్మెంట్ కష్టమే....
మన దేశంలో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లేదా ఫాల్టీ ప్రొడక్ట్ రీప్లేస్మెంట్ పొందడం చాలా కష్టమైనదేనని తమ సర్వేలో తేలినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కన్జూమర్లు చాలా కాలమే వెయిట్ చేయాల్సి వస్తోందని పేర్కొంది. అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్లు సరిగా పనిచేయడం లేదనే కంప్లయింట్లు కన్జూమర్ల నుంచి రెగ్యులర్గా వస్తున్నాయని లోకల్ సర్కిల్స్ తెలిపింది. ప్రొడక్టుపై వారంటీ ఉన్నా సరే, రీప్లేస్మెంట్ ఇవ్వకుండా ఉండటానికి ఎలాంటి స్థాయికైనా వెళ్లడానికి కంపెనీలు సిద్ధపడుతున్నాయని పేర్కొంది.
కంపెనీలపై యాక్షన్ తీసుకోవాల్సిందే.....
ఆఫ్టర్ సేల్స్ సర్వీసు మన దేశంలో అధ్వాన్నంగా ఉంటోందని చాలా మంది కన్జూమర్లు లోకల్ సర్కిల్స్కు తెలిపారు. ఈ నేపథ్యంలో డిఫెక్టివ్ ప్రొడక్టులు అమ్ముతున్నట్లు తేలిన కంపెనీలపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సూమోటోగా చర్యలు తీసుకోవాలని కన్జూమర్లు కోరుతున్నట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. 94 శాతం మంది కన్జూమర్లు ఈ ప్రపోజల్కు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. ఆటోమొబైల్స్, గాడ్జెట్లు, వైట్ గూడ్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ వంటి హై వాల్యూ ప్రొడక్ట్ల ఆఫ్టర్ సేల్స్ సర్వీసుపై లోకల్ సర్కిల్స్ ఈ స్టడీ నిర్వహించింది.