బీజేపీ మూడో జాబితాలో గ్రేటర్ నుంచి 9 మంది ఖరారు
ఇంకా కీలక స్థానాల్లో ప్రకటించని హైకమాండ్
హైదరాబాద్, వెలుగు : బీజేపీ మూడో జాబితాలో సిటీ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని ముఖ్యమైన స్థానాల్లో ఇంకా ఖరారు చేయకపోవడంతో టికెట్లను ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించగా ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ ఆశావహుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారా? ప్రచారాన్ని ఎప్పుడు చేసుకోవాలా? అనే ఆతృత ఆశావహు ల్లో ఉంది.
బీజేపీ అధిష్టానం గురువారం 35 మందితో మూడో జాబితా ప్రకటించింది. ఇందులో సిటీలో 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. ఆయా చోట్ల సస్పెన్స్కు తెర పడింది. శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కూకట్పల్లి , సికింద్రాబాద్, కంటోన్మెంట్ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆ పార్టీ నేతల్లో అయోమయం నెలకొంది.
రంగారెడ్డి జిల్లాలో ఇలా..
షాద్ నగర్/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లాలో షాద్ నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీనియర్ నేత ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబాయ్యకు అవకాశం కల్పించారు. పార్టీ నుంచి టికెట్ ఆశించిన నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలకు భంగపాటు ఎదురైంది. చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నంకు కేటాయించారు. కొద్దిరోజుల కిందట ఆయన బీజేపీలో చేరగా.. మూడో జాబితాలోనే ఆయన పేరు ప్రకటించారు. బీఆర్ఎస్ టికెట్ఇవ్వకపోవడంతో ఆయన పార్టీ మారారు.