- కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్పై స్టేకు హైకోర్టు నో
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసే ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ రెగ్యులరైజేషన్ ప్రక్రియ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సూచించింది. ఈ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్టంలో క్రమబద్ధీకరణను చేర్చుతూ ప్రభుత్వం జీవో 18ని జారీ చేసింది. దీన్ని ప్రవీణ్కుమార్, ఇతరులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ల బెంచ్ విచారించింది.
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వృత్తి విద్యాకోర్సులకు చెందిన కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గత మేలో ఇచ్చిన జీవోలు 19, 20, 21, 23, 31 అమలును నిలిపివేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇప్పటికే నియామక ప్రక్రియ మొదలైందని ఏజీ ప్రసాద్ చెప్పారు. స్పందించిన బెంచ్.. చట్టంలో ఒక నిబంధనను సవాల్ చేశారని చెప్పి ఇప్పటికే మొదలైన ప్రక్రియను నిలిపివేస్తూ స్టే ఇవ్వలేమంది.